అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేదికపై నుంచే ప్రధాని మోడీ రూ.18,000 కోట్లు విలువైన పలు అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్ వే వంటిదని.. ఆంధ్రా యువతకు లాంచ్ ప్యాడ్ వంటిదన్నారు. సిఎం చంద్రబాబు నాయుడు విజన్ అద్భుతమని ప్రధాని మోడీ మెచ్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తున్నందుకు చాలా సంతోషం. అయితే ప్రధాని మోడీ నుంచి ప్రభుత్వం, ప్రజలు కోరుకుంటున్నది మరొకటి ఉంది. ఇక ముందు కూడా ఆంధ్రప్రదేశ్ ఇంతే వేగంగా అభివృద్ధి చెందాలంటే, రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత చాలా ముఖ్యం. లేకుంటే కథ మళ్ళీ మొదటికొస్తుంది.. అని అందరూ అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు.
కనుక బిజేపి కూడా భాగస్వామిగా ఉన్న ఈ కూటమి ప్రభుత్వానికి ప్రధాని మోడీ రాజకీయంగా కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది.
రెండుసార్లు ఎదురుదెబ్బలు తిని తీవ్రంగా నష్టపోయి అభివృద్ధిలో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. ప్రధాని మోడీ కూడా ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు. కనుక సిఎం చంద్రబాబు నాయుడుకి రాజకీయంగా సహాయసహకారాలు అందించడం అవసరం.
అయన కూడా మోడీ ప్రభుత్వానికి అండగా నిలబడుతూ అవరోధాలు అధిగమించేందుకు ఉడతా భక్తిగా తోడ్పడుతున్నారు కదా?
ప్రధాని మోడీ, సిఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ దూరదృష్టితో పనిచేసే నాయకులు. వారి విజన్ నిజమవ్వాలంటే వారి ప్రభుత్వాలు స్థిరంగా ఉండాలి. కొనసాగాలి. అందుకు రాజకీయంగా కూడా పరస్పరం సహకరించుకోవడం చాలా అవసరమే కదా?






