నవంబర్ 8న నోట్ల రద్దును ప్రకటించిన తరువాతి నుంచి నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా ‘లక్కీ గ్రాహక్’, ‘డిజి ధన్ వ్యాపారి’ స్కీములను మోడీ సర్కారు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రజలను ఆకర్షించేందుకు అనుగుణంగా నవంబర్ 9 నుంచి ఏప్రిల్ 14 వరకూ ఈ స్కీమ్ అమల్లో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే.
నగదు రహిత లావాదేవీలు జరిగినప్పుడు వెలువడే ట్రాన్సాక్షన్ ఐడీలను డ్రా తీసి, రోజుకు 15 వేల మందికి 1000, వారానికి ఓ సారి లక్ష, 7 వేల మందికి 5 వేలు, 10 వేల చొప్పున, ఇక బంపర్ డ్రాగా, ఏప్రిల్ 19న ఒక కోటి, 50 లక్షలు, 25 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నారు. ఇక, గడచిన మూడు వారాల్లో 45 మంది వరకూ లక్కీ కస్టమర్లుగా ఎంపికై లక్షాధికారులు అయినట్టు తెలుస్తోంది.
వీరిలో అత్యధికులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు కావడం విశేషం. ఏపీతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, యూపీలకు చెందినవారు కూడా ఉన్నారని సమాచారం. నగదును పక్కనపెట్టి, కార్డులను వాడి ఈ-పేమెంట్స్ చేయడం ద్వారా ఈ స్కీమ్ లో పాల్గొనేందుకు అర్హత పొందవచ్చు. మరి రాబోయే నాలుగు మాసాల్లో మరికొంతమందిని కేంద్ర ప్రభుత్వం లక్షాధికారులుగా తయారు చేసే అవకాశం ఉంది.



