జమిలి ఎన్నికలు, ఇండియా పేరు మార్పు… అవసరమా?

Narendra Modi  అభివృద్ధి, సంక్షేమం రెంటినీ చక్కగా బ్యాలన్స్ చేసుకొంటూ ప్రజాస్వామ్యబద్దంగా చక్కగా పరిపాలన చేస్తుంటే, ఎన్నికలలో గెలిచేందుకు ఎలాంటి జిమ్మిక్కులు చేయవలసిన అవసరం ఉండదు. వాటిని చూపి ధైర్యంగా ప్రజలను ఓట్లు అడగవచ్చు. పొందవచ్చు.

తెలంగాణ ప్రభుత్వం ఇదే చేస్తోంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపిలు బలపడగా, కేసీఆర్‌ నిరంకుశత్వ పాలన సాగిస్తూ భారీగా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. కనుక కేసీఆర్‌ మరింత జాగ్రత్త పడుతూ అన్ని వర్గాల ప్రజలకు వరాలు ప్రకటిస్తూనే ఉన్నారు. కొత్తగా సంక్షేమ పధకాలు ప్రారంభిస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ, సిఎం కేసీఆర్‌ ఇద్దరి ఆలోచనలు, వైఖరి, నిర్ణయాలు అన్నీ ఇంచుమించు ఒకేలా ఉండటం విశేషం. ఈ కారణంగా మోడీ ప్రభుత్వం పట్ల, బిజెపి పట్ల కూడా దేశ ప్రజలలో చాలా వ్యతిరేకత నెలకొని ఉంది. కనుక ప్రధాని మోడీ కూడా లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవడం కోసం గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గింపు వంటి వరాలు ప్రకటించడం మొదలుపెట్టారు.

అయితే సువిశాలమైన భారతదేశంలో జరిగే లోక్‌సభ ఎన్నికలలో గెలవాలంటే కేవలం కొన్ని వరాలు ప్రకటిస్తే సరిపోదు. అందుకే మోడీ,అమిత్‌ షాలు రెండు భారీ వ్యూహాలకు శ్రీకారం చుట్టారు. వాటిలో భాగంగానే జమిలి ఎన్నికల నిర్వహణ, ఇండియా పేరును భారత్‌గా మార్చే ప్రతిపాదనలు కూడా. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు వీటి కోసమే అని తెలుస్తోంది.

ఈ రెండు ప్రతిపాదనలు బిజెపిని గెలిపించుకోవడానికి, ప్రత్యర్దులను రాజకీయంగా దెబ్బ తీయడానికి బాగానే పనికిరావచ్చు. కానీ బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి కొత్త సమస్యలు సృష్టించడం అవసరమా?భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక వందలసార్లు రకరకాల ఎన్నికలు జరిగాయి. అవన్నీ సవ్యంగానే జరిగాయి. అలాగే భారతీయులు భారత్‌ అనుకొన్నా ఇండియా అనుకొన్నా ఎవరూ ఎన్నడూ ఇబ్బంది పడలేదు. విదేశాలలో ‘ఇండియా’ ఇప్పుడు ఓ బ్రాండ్ ఇమేజ్‌ సంపాదించుకొంది కూడా.

కనుక జమిలి ఎన్నికలతో రాజకీయ ప్రత్యర్ధులను ఎన్నికలలో దెబ్బతీయడానికి, భారత్‌-ఇండియా పేరుతో దేశ ప్రజలలో చిచ్చు రగిలించి బిజెపి లబ్ధి పొందడానికి చేస్తున్న ఈ ప్రయత్నాలను హర్షించలేము.

జమిలి ఎన్నికలు నిర్వహించడం వలన ఎన్నికల నిర్వహణ కోసం చేస్తున్న ఖర్చు కొన్ని వేలకోట్లు మిగులుతుందని వాదిస్తున్నారు. అయితే జమిలి ఎన్నికల నిర్వహణకు వివిద వ్యవస్థలలో, చివరికి ఈవీఎంలలో చేయవలసిన మార్పులు, చేర్పులకి కూడా కొన్నివేలకోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇక ఇండియా పేరును భారత్‌గా మార్చిన్నట్లయితే దేశవ్యాప్తంగా వేలాది ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో, కోట్లాది పత్రాలలో, లక్షలాది వ్యవహారాలలో కూడా తదగుణంగా మార్పులు చేయాల్సి ఉంటుంది. అది ఎంత కష్టం, ఎంత భారం తెలియాలంటే ఓ చిన్న ఉదాహరణ చెప్పుకొందాము.

భారత్‌లో చలామణిలో ఉన్న నోట్లపై, నాణేలపై కూడా హిందీలో ‘భారతీయ రిజర్వ్ బ్యాంక్’ అని, ఇంగ్లీషు భాషలో ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని ముద్రించబడి ఉంటుందనే సంగతి తెలిసిందే. అదేవిదంగా నాణేలపై కూడా భారత్‌, ఇండియా అని ముద్రించబడి ఉంటుంది.

కనుక ఇప్పుడు ఇండియా పేరును భారత్‌గా మార్చిన్నట్లయితే దేశంలో ఉన్న కోట్లాది నోట్లమీద ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ని, నాణేల మీద ఇండియాని కూడా మార్చాల్సి ఉంటుంది కదా?ఇది ఎంత కష్టం… ఎంత నష్టం?ఇలా చెప్పుకొంటూ పోతే జమిలి ఎన్నికలు, ఇండియా-భారత్‌ మార్పుల భారం చాలానే ఉంటుంది. కానీ బిజెపి రాజకీయ అవసరాలు, లబ్ధి కోసం ఈ భారాన్ని దేశప్రజలందరూ భరించాలంటే ఎలా?

ADVERTISEMENT
Latest Stories