కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ గా ముద్రపడిన నయీం మరణం తర్వాత కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా జగ్గిరెడ్డి అనే నయీం అనుచరుడి గురించి సినీ నిర్మాత నట్టి కుమార్ చెప్పారు. నయీం ప్రధాన అనుచరుడిగా జగ్గిరెడ్డి యథేచ్ఛగా అరాచకాలకు తెగబడ్డాడని ఆరోపణలు చేసిన నట్టికుమార్, జగ్గిరెడ్డిని సిట్ విచారిస్తే చాలా మంది జాతకాలు బయట పడతాయని అన్నారు. జగ్గిరెడ్డి వద్ద సుమారు వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని, ఇందుకు సంబంధించి తనకు తెలిసిన వివరాలు సిట్ కు అందజేస్తానని తెలిపారు.
అలాగే, నయీం అరాచకాలు, ఆంధ్రప్రదేశ్ లో నేతల సంబంధాలపై మంత్రి అచ్చెన్నాయుడికి తానూ తెలిపానని నట్టి కుమార్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అచ్చెన్నాయుడిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, దీనిపై బహిరంగ చర్చకైనా, మీడియా వేదికగా చర్చకైనా తాను సిద్ధమని ప్రకటించారు. మంత్రిని కలిసి, నయీం గురించి చెప్పి హెచ్చరించానని చెప్పేందుకు తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. తాను మీడియాతో మాట్లాడిన తరువాత సినీ పరిశ్రమలో ఎంతో మంది నయీం బాధితులు తనతో ఫోన్ లో మాట్లాడారని అన్నారు.
అయితే, సినీ నిర్మాత నట్టి కుమార్ చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందిస్తూ… అసలు నట్టి కుమార్ ఎవరో తనకు తెలియదని, తన జీవితంలో అలాంటి వ్యక్తిని కలిసిన గుర్తు కూడా లేదని చెప్పారు. తనపై ఆరోపణలు చేస్తున్న నట్టి కుమార్ లేదా ఇంకెవరైనా విచారణ జరిపించుకోవచ్చని సవాలు విసిరారు. నట్టి కుమార్ చెబుతున్న విషయాలు తన దృష్టికి రాలేదని స్పష్టం చేశారు. నయీం ఉదంతంలో సిట్ చేస్తున్న విచారణలో మరెన్ని సంచలన విషయాలు బయట పడతాయో చూడాలి.



