తెలంగాణ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, ఇటీవల హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ కు సంబంధించి ప్రముఖ సినీ నిర్మాత నట్టి కుమార్ సంచలన విషయాలు వెల్లడించారు. ప్రధానంగా టాలీవుడ్ ను టార్గెట్ చేసిన నట్టి కుమార్… తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలకు నయీమ్ తో సంబంధాలున్నాయని ఆరోపించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు గుప్పించారు.
తెలుగు చిత్ర సీమలో ప్రముఖ నిర్మాతలుగా కొనసాగుతున్న సి.కల్యాణ్, అశోక్ కుమార్, బండ్ల గణేశ్, సచిన్ జోషిలకు నయీమ్ తో సంబంధాలున్నాయని, సినిమా థియేటర్లలో క్యాంటీన్ల వ్యాపారమంతా నయీమ్ దేనన్నారు. ఈ క్రమంలో తన థియేటర్ ను కూడా నయీమ్ అనుచరులు లాగేసుకున్నారని, నయీమ్ తో టాలీవుడ్ కు ఉన్న లింకులపై తెలంగాణ సిట్ కు ఫిర్యాదు చేస్తానన్నారు.
ఏపీలోని కొందరు పోలీసు అధికారులకు కూడా నయీమ్ తో సంబంధాలున్నాయని, ఈ విషయాలపై ఏపీ పోలీసులకు, మంత్రి అచ్చెన్నాయుడికి చెప్పినా పట్టించుకోలేదని కూడా నట్టికుమార్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్నాయి. చిన్న సినిమాలకు ధియేటర్లు దొరకడం లేదంటూ సహజంగా ఎప్పుడూ మీడియాకు ఎక్కే నట్టికుమార్, ఈ సారి ఏకంగా గ్యాంగ్ స్టర్ కు – నిర్మాతలకు సత్సంబంధాలు ఉన్నాయని బాంబు పేల్చారు.
మరో విశేషమేమిటంటే… నట్టికుమార్ పేర్కొన్న వారి పేర్లన్నీ అతి తక్కువ సమయంలోనే భారీ నిర్మాతలుగా ఎదిగిన వారు కావడం ఈ వ్యాఖ్యలకు మరింత బలాన్నిస్తోంది. ముఖ్యంగా సి.కళ్యాణ్ విషయంలో గతంలో మద్దెలచెరువు సూరి హతమైన విషయంలో కూడా ఇలాంటి ఆరోపణలే వ్యక్తం కావడం గమనించదగ్గ విషయమే. అలాగే ‘మెగా’ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న బండ్ల గణేష్ పై కూడా బొత్స సత్యనారాయణ బినామీగా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.



