చట్టాలున్నాయి కానీ శిక్షలు పడటం లేదు.. అందుకే నీట్‌గా..

NEET Paper Leak: Tougher Law Enough to Stop Exam Scams?

ఢిల్లీలో జరిగిన నీట్ ఆందోళనకు మోడీ ప్రభుత్వం దిగి వచ్చింది. నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం జరిగింది. దానిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపై ప్రశ్నపత్రాలు లీక్ చేసినట్లు రుజువైతే పదేళ్ళు జైలు శిక్ష, రూ.10 కోట్లు జరిమానా విధించేందుకు ఆమోదం తెలిపారు. వీటి కోసమే ప్రత్యేకంగా 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కోర్టులు మూడు నెలల్లోగా విచారణ పూర్తిచేసి తుది తీర్పు ప్రకటించాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి ఇప్పటికే ఢిల్లీ కోర్టులో ఏర్పాటయింది. మిగిలిన నాలుగూ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తారు.

ADVERTISEMENT

ఈ నిర్ణయాలపై కేంద్రమంత్రులలో ఒకరు మరికొద్ది సేపటిలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చేవారం ఈ బిల్లుని లోక్‌సభలో ప్రవేశపెడుతుంది.

అయితే ఇప్పటికే ఇలాంటి కేసులలో దోషులకు 3 నుంచి 5 ఏళ్ళు జైలు శిక్షతో పాటు రూ.10 లక్షల వరకు జరిమానా విధించేందుకు చట్టం ఉంది. అదే.. ప్రశ్నాపత్రాలను కొందరు వ్యక్తులు లేదా ముఠాలు కలిసి లీక్ చేసినట్లు రుజువైతే వారికి 5 నుంచి 10 ఏళ్ళ పాటు జైలు శిక్ష, కోటి రూపాయలు జరిమానా విధించాలని అదే చట్టంలో మరో సెక్షన్ ఉంది.

అంటే చట్టాలు ఉన్నాయి కానీ నేరం రుజువు కావడం లేదు. దోషులకు శిక్షలు పడటం లేదన్న మాట! ఇదివరకు తెలంగాణలో గ్రూప్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయినప్పుడు, దేశంలో అనేకమార్లు లీక్‌లైనప్పుడు, తాజాగా నీట్ లీకేజ్‌లతో ఇదే నిరూపితమైంది కదా?

కటినమైన చట్టాలు ఎన్ని ఉన్నా అవి అమలుకానప్పుడు.. నేరస్తులకు శిక్షలు విధించలేనప్పుడు శిక్షా కాలం, జరిమానాలు ఇంకా ఎంత పెంచుకుపోతే మాత్రం ఏం ప్రయోజనం?

ఉదాహరణకు దేశంలో నిర్భయ, దిశ, పోక్సో వంటి చట్టాలు, వాటితో అత్యంత కటినమైన శిక్షలు అమలులో ఉన్నాయి. కానీ మహిళలపై హత్యలు, అత్యాచారాలు ఆగడం లేదు. ఎందువల్లనంటే దోషులను నేరం చేశారని నిరూపించడమే చాలా క్లిష్టమైన ప్రక్రియగా మారింది. ఒకవేళ నిరూపించగలిగినా దోషులు న్యాయపరమైన లొసుగులని తెలివిగా ఉపయోగించుకుంటూ శిక్షలు పడకుండా తప్పించుకొంటూనే ఉన్నారు.

అదే.. సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలలో నేరస్తులకు వీలైనంత త్వరగా శిక్షలు పడేలా చేస్తూ అత్యంత సమర్ధంగ నేర నియంత్రణ చేస్తున్నాయి. భారత్‌లో కూడా అంత వేగంగా నేరస్తులకు శిక్షలు పడుతున్నప్పుడే నేరాలు చేయాలంటే భయం కలుగుతుంది. కనుక నేర నిరూపణ, శిక్షల అమలు ఎంత త్వరగా అనేదే ముఖ్యం. అదెలా అమలు చేయాలో ఆలోచిస్తే చాలు. చివరిగా ఒక మాట! ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా రాజకీయాలకు ఉపయోగపడతాయేమో కానీ దేశానికి, విద్యార్ధులకు కాదు.

ADVERTISEMENT
Latest Stories