నీట్ ఉద్యమం… విద్యార్థులదా? కాంగ్రెస్ పార్టీదా?

NEET protest political campaign

ఒక్కోసారి పెరిగిన ఉల్లిపాయల ధరలు కూడా ప్రభుత్వాలను పడగొట్టగలవు. కనుక ఎప్పుడు ఏ సమస్య లేదా అంశం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతుందో ఊహించడం కష్టం. అటువంటిదే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు.

మొదట ఇది విద్యార్థుల సమస్యగా మొదలైనప్పటికీ క్రమంగా రాజకీయంగా మారింది. కాంగ్రెస్‌ మిత్రపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలే ఇందుకు నిదర్శనం.

ADVERTISEMENT

నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అవడంతో పరీక్షలు రద్దవడంతో దేశవ్యాప్తంగా ఆ పరీక్షలకు హాజరైన లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయిన మాట వాస్తవం. ఆ కారణంగా వారు తీవ్ర మనోవేదనకు గురవడం వాస్తవమే.

వారి ఆగ్రహం, అసంతృప్తిని కాంగ్రెస్‌, మిత్రపక్షాలు గుర్తించి దానిని మోడీ ప్రభుత్వంపై ఆయుధంగా ప్రయోగిస్తున్నాయి. ఇక్కడే విద్యార్థులు, కాంగ్రెస్‌ మిత్రపక్షాల ఆలోచనలు, ఉద్దేశ్యాలు వేరయ్యాయి.

విద్యార్థులు తమకు జరిగిన అన్యాయం సరిచేయాలని కోరుతూ ఆందోళన చేస్తుంటే, కాంగ్రెస్‌ మిత్రపక్షాలు వారికి అండగా నిలబడి ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని ఆరాటపడుతున్నాయి.

వచ్చే ఎన్నికలలో ప్రధాని మోడీ, ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే, కాంగ్రెస్‌ పార్టీ ఇక ఎన్నటికీ కోలుకోలేదు. కనుక ఢిల్లీలో చిన్నగా మొదలైన ఈ ఆందోళనలను ఉద్యమంగా మార్చి దేశవ్యాప్తంగా వ్యాపింపజేయడం ద్వారా మోడీ ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బ తీయడం.
విద్యార్థుల తరపున పోరాడుతూ కాంగ్రెస్‌ పార్టీ దేశ ప్రజలను ఆకట్టుకోవడం. పనిలో పనిగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేయడం.
దేశంలో బీజేపీయేతర ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నందున అవి కూడా కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపాయనుకోవచ్చు.

దక్షిణాది రాష్ట్రాలలో ఒక్క ఆంధ్రాలో తప్ప తెలంగాణ, కర్ణాటక, కేరళలో కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలో ఉంది. తమిళనాడులో విజయ్‌ ప్రభుత్వంలో కాంగ్రెస్‌ భాగస్వామిగా ఉంది. కనుక ఈ నాలుగు రాష్ట్రాలలో ఈ ఉద్యమాన్ని వ్యాపింపజేయడం పెద్ద కష్టం కాదు.

కనుక అటు ఉత్తరాదిలో, ఇటు దక్షిణాది రాష్ట్రాలలో ఏకకాలంలో ఈ ఉద్యమాన్ని ఉదృతం చేయగలిగితే రాజకీయంగా లబ్ధి పొందవచ్చని కాంగ్రెస్‌ ఆలోచనగా కనిపిస్తోంది.

ఇప్పుడిది విద్యార్థులు, యువత చేతిలో నుంచి కాంగ్రెస్‌ మిత్ర పక్షాల చేతిలోకి వెళ్ళిపోయింది. వారి ఆందోళనకు అర్థం, తీరు, ఉద్దేశ్యం, ప్రయోజనాలు అన్నీ సమూలంగా మారిపోయాయి. కనుక ఇప్పుడు వారే ఆలోచించుకోవాలి. దీనిలో కొనసాగాలో వద్దో!

ADVERTISEMENT
Latest Stories