నెల్లూరు వైసీపీలో ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధిష్టానంపై తిరుగుబాటు చేసిన తర్వాత, అదే జిల్లాలో వరుసగా మరో రెండు పెద్ద వికెట్లు (ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి) టపటపా పడిపోయాయి. వారిరువురూ మౌనంగా ఉండిపోయారు కానీ కోటంరెడ్డి మాత్రం నెల్లూరులో చాలా యాక్టివ్గా ఉంటున్నారు.
పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి తన రూరల్ నియోజకవర్గంతో పాటు నెల్లూరు అర్బన్లో కూడా రాజకీయంగా పట్టు పెంచుకొనేందుకు కోటంరెడ్డి గట్టిగా కృషి చేస్తున్నారు. తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడు తన నియోజకవర్గంలో జగనన్న మంజూరు చేసిన పనులకు నిధులు విడుదల చేయాలంటూ దీక్షలు చేస్తూ, జనాల చేత సిఎంకు పోస్టుకార్డులు వ్రాయిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తుండటంతో ఈ మూడు నెలల్లోనే కొన్ని పనులు జరుగుతున్నాయి. తన పోరాటాల వలననే పనులు జరుగుతున్నాయనే విషయం ఎక్కడికక్కడ ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టి మరీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చాటింపు వేసుకొంటున్నారు. నెల్లూరు పట్టణంలో కూడా కోటంరెడ్డి హడావుడి ఎక్కువవడంతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్లో అసహనం మొదలైంది. అదే మీడియా సమావేశంలో బయటపడింది.
బుదవారం నెల్లూరు పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “ఆయన పార్టీలో ఉన్నప్పుడు నాలుగేళ్ళు నిద్రపోయి, సస్పెండ్ అయ్యాక ఇప్పుడు పనులు జరగడం లేదంటూ సిఎం జగన్ మీద ఆరోపణలు చేస్తున్నారు. సిఎంకు నెల్లూరు ఒక్కటే కాదు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలను చూసుకోవలసిన బాధ్యత ఉంటుంది. కానీ నా ఒక్క నియోజకవర్గానికే రూ.2,000 కోట్లు కేటాయించమని ఒత్తిడి చేస్తే ఎలా?ఏ నియోజకవర్గంలోనైనా పనులకు ఎప్పుడూ అంతే ఉండదు. కనుక ఎమ్మెల్యేలు ఓ పది పనులు అడిగితే వాటిలో 7-8 పనులను మంజూరు చేస్తూ జగన్ సంతకాలు చేస్తుంటారు. వాటిని పట్టుకొని సంతకాలు పెట్టారు… కానీ నిధులు ఇవ్వడం లేదని ఆరోపిస్తే ఎలా?
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీలో ఉన్నప్పుడు ఎక్కువగా సొంత పనులు చూసుకొనేవారు. అప్పుడే జగనన్నను గట్టిగా అడిగి ఉండొచ్చు కదా? అప్పుడు అడగకుండా ఇప్పుడు అడుగుతూ పనులు పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. కోటంరెడ్డికి చెడుకాలం దాపురించింది. అందుకే ఆయన తన రాజకీయజీవితాన్ని పాడుచేసుకొన్నారు. ఓటమి ఆయన నుదుట రాసిపెట్టి ఉంది కనుకనే పార్టీ మారడానికి సిద్దమయ్యారు. మహా అయితే మరో ఆరు నెలలు అంతే… ఆ తర్వాత ఆయన రాజకీయ ఛాప్టర్ క్లోజ్ అయిపోతుంది,” అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.



