బిఆర్ఎస్‌ ఓటమికి కుంటిసాకులు ఎందుకు?కారణం కనబడుతుంటే!

KCR-Telangana-BRS

తెలంగాణలో తిరుగేలేదనుకున్న బిఆర్ఎస్‌ ఓటమికి కారణం ఏమిటి?అంటే ‘కేసీఆర్‌’ అని ఒకే ఒక్క సమాధానం చెప్పుకోవచ్చు. ఆయన అహంభావం, నియంతృత్వపు పోకడల వల్లనే ప్రజలు ఆయన హితోక్తులను, ఆయన చేసిన అభివృద్ధిని పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు.

కాంగ్రెస్‌ గెలుపుకి, బిఆర్ఎస్ అంటే కేసీఆర్‌ ఓటమికి ఇంకా అనేక కారణాలు ఉండవచ్చు. కానీ ప్రధాన కారణం మాత్రం ఇదేనని పలువురు రాజకీయ విశ్లేషకులు తేల్చి చెప్పేశారు. కానీ నేటికీ ఆ పార్టీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఒప్పుకోవడం లేదు!

ADVERTISEMENT

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి గెలిచిందని, తాము సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చకపోవడం వలన, ఇంకా చిన్న చిన్న తప్పిదాల వలన ఓడిపోయామని సర్దిచెప్పుకుంటున్నారు. ఓడిపోయిన ఏ పార్టీ అయినా ఇలాగే చెప్పుకుంటుంది. కనుక ఆయనను తప్పు పట్టలేము కానీ పార్టీ అంతర్గత సమావేశాలలోనైనా ఓటమిపై నిష్కర్షగా ఆత్మవిమర్శ చేసుకుంటే వారికే మంచిది.

కానీ కేసీఆర్‌ వలననే ఓడిపోయామని చెప్పగలిగే ధైర్యం బిఆర్ఎస్ పార్టీలో ఎవరికీ ఉండదు. చెపితే ఈటల రాజేందర్‌లాగ బయటకు గెంటివేయబడతారు. కనుక బిఆర్ఎస్ ఓటమికి మరో బలమైన కారణం కనుగొని దానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

టిఆర్ఎస్‌ని బిఆర్ఎస్‌గా మార్చడం వలననే 1-2 శాతం ఓట్లు తక్కువ పడి ఓడిపోయామని కనుక మళ్ళీ బిఆర్ఎస్‌ని టిఆర్ఎస్‌గా మార్చితే బాగుంటుందని కడియం శ్రీహరి వంటి సీనియర్ నేతలు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే పార్టీ పేరు మార్చి కేసీఆర్‌ తప్పు చేశారని వారు చెపుతున్నట్లే భావించవచ్చు.

కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పి ప్రధానమంత్రి పదవి చేప్పటాలనే ఆలోచనతోనే ఏకపక్షంగా పార్టీ పేరుని మార్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కేసీఆర్‌ ఓ రకంగా ఆలోచిస్తే, కాంగ్రెస్‌, బీజేపీలు దానిని మరో రకంగా తీసుకుని కేసీఆర్‌, టిఆర్ఎస్ పార్టీ తెలంగాణతో బంధం తెంచేసుకొన్నారంటూ చాలా విస్తృతంగా ప్రచారం చేసాయి.

దాంతో బిఆర్ఎస్ వేరు, టిఆర్ఎస్‌ పార్టీ వేరు అని ప్రజలు భావించి మనకు ఓట్లు వేయలేదని కడియం శ్రీహరి వంటి నేతలు చెపుతున్నారు. కనుక మళ్ళీ బిఆర్ఎస్‌ పేరుని టిఆర్ఎస్‌ పార్టీగా మార్చితే బాగుంటుందని సూచిస్తున్నారు.

తెలంగాణ ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యవంతులని కేసీఆర్‌తో సహా బిఆర్ఎస్‌ నేతలే ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పారు. కనుక టిఆర్ఎస్‌ పేరు మార్చి బిఆర్ఎస్‌ అని పెట్టుకుంటే అయోమయంలో కాంగ్రెస్‌కు ఓట్లు వేసి గెలిపించారనుకోలేము కదా? వారు చైతన్యవంతులు కనుకనే కేసీఆర్‌ని గద్దె దించారని చెప్పుకుంటే సమంజసంగా ఉంటుంది.

కనుక బిఆర్ఎస్‌ నేతలకు ధైర్యం ఉంటే ఇప్పటికైనా కేసీఆర్‌ తీరు, పోకడలపై చర్చించగలిగితే వారికి రాజకీయ భవిష్యత్‌ ఉంటుంది. కానీ కేసీఆర్ మంచం మీద ఉన్నా ఆయనే మాకు దిక్కు… ఆయన పద్దతిలోనే బిఆర్ఎస్ పార్టీ నడుస్తుందని కేటీఆర్‌ చెపుతున్నారు!

దీనిని ఆయన క్రమశిక్షణ అనుకోవచ్చు కానీ ఇది ఆయన బేలతనాన్ని సూచిస్తునట్లుంది. కేసీఆర్‌ పద్దతిలోనే బిఆర్ఎస్ పార్టీ నడిస్తే కాంగ్రెస్ పార్టీకి చాలా మేలు కలుగుతుంది. ఈ విషయం త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో మరోసారి నిరూపింపబడవచ్చు.

ADVERTISEMENT
Latest Stories