కాకినాడ పోర్టు కేసులో విజయసాయి రెడ్డిని ఏపీ సీఐడీ పోలీసులు విచారణకి పిలిస్తేనే విజయవాడ వచ్చి, వైసీపీ అధినేత జగన్-కోటరీ గురించి చాలా విషయాలే మాట్లాడారు.
ఇప్పుడు ఆయనకు మద్యం కుంభకోణం కేసులో సిట్ నోటీస్ ఇవ్వడంతో బహుశః వైసీపీ నేతల గుండెలు గుభేల్మనవచ్చు. ఈ నెల 18న విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులో పేర్కొంది.
అక్రమాస్తుల కేసులలోనే పుష్కర కాలంగా ఆటాడుకుంటున్న ఆయనకు ఈ మద్యం కేసు ఓ లెక్కా? అంటే కాదనే చెప్పొచ్చు. కాకినాడ పోర్టు కేసులో విచారణకు వచ్చినప్పుడే మద్యం కుంభకోణంలో ‘కర్త, ఖర్మ, క్రియ అని రాజశేఖర్ రెడ్డే’ అని కుండబద్దలు కొట్టారు.
కనుక ఇప్పుడు ఇదే కేసులో విజయసాయి రెడ్డి విచారణకి హాజరైతే మరింకెన్ని ప్యాలస్ రహస్యాలు బయటపెడతారో ఎవరూ ఊహించలేరు.
జగన్ తన పట్ల చాలా అవమానకరంగా ప్రవర్తించారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఆ బాధతోనే తాను వైసీపీకి, ఎంపీ పదవికి రాజినామా చేశానని చెప్పుకున్నారు కూడా. కానీ అక్రమాస్తుల కేసుల నుంచి ‘ఉపశమనం-గ్యారెంటీ’ లభించినందునే ఆయన రాజీనామా చేసి తాత్కాలికంగా రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారని అప్పుడే వార్తలు వచ్చాయి.
కనుక మద్యం కుంభకోణం కేసులో ఆయన పోలీసులకు మనస్పూర్తిగా సహకరించడానికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. కనుక ఈ కేసులో ప్రత్యేకించి ఆయనని విచారణకి పిలిపించడం వైసీపీ నేతలు జీర్ణించుకోవడం కష్టమే. ఒకవేళ ఆయన నోరువిప్పినా చాలా ప్రమాదమే. విజయసాయి రెడ్డిని పిలిస్తే వైసీపీ నేతలు ఆందోళన చెందాల్సివస్తోంది పాపం!




