కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు ఓటమికి వంద శాపాలన్నట్లు తెలంగాణలో కేసీఆర్ ఓటమికి, రేపు ఏపీలో జగన్ ఓడిపోతే దానికీ అన్నే కారణాలున్నాయి. అవన్నీ ప్రజలకు కూడా తెలుసు. కానీ ప్రస్తుతం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు చెప్పుకునే కారణాలు, రేపు జగన్, వైసీపి నేతలు చెప్పుకోబోయే కారణాలు ప్రజలకు వేరేగా ఉంటాయి.
తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయినప్పుడు, కాంగ్రెస్ నేతలు మాయ మాటలు చెప్పి, నోటికి వచ్చిన హామీలు ఇచ్చేసి ప్రజలను మభ్యపెట్టి గెలిచారని చెప్పుకున్నారు. ఆ తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం వలన ఓడిపోయామని చెప్పుకున్నారు.
ఆ తర్వాత ఎన్నికల సమయంలో కొన్ని పొరపాట్లు చేయడం వలన ఓడిపోయామని చెప్పుకున్నారు. కాంగ్రెస్ నేతలు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచడం వలన ఓడిపోయామని చెప్పారు. తాజాగా రాష్ట్రంలో కొన్ని వర్గాలను దూరం చేసుకోవడం వలన ఓడిపోయామని కేటీఆర్ అన్నారు. యువత, ప్రభుత్వోద్యోగులకు దూరం అవడం వలన ఓడిపోయామని ఈరోజు చెప్పారు.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు చెప్పుకున్న కారణాలే ఇన్ని ఉన్నాయి. కానీ అసలు కారణాలు మరో వంద ఉన్నాయని, వాటి గురించి ఈ ముగ్గురూ ఎన్నడూ చెప్పుకొని ఒప్పుకోరని, సరిదిద్దుకోరని అందరికీ తెలుసు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ధి చేసి, అనేక ఐటి కంపెనీలు, పరిశ్రమలను రప్పించి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి, అనేక సంక్షేమ పధకాలు అమలుచేసినా ప్రజలు తమని ఎందుకు కాదనుకున్నారు? అని కేసీఆర్, కేటీఆర్ బహుశః ఆలోచించడానికి కూడా ఇష్టపడకపోవచ్చు.
బిఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం కేసీఆర్ అహంకారమే. ఆ తర్వాత ఆయన నిరంకుశత్వం, అన్నీ నాకు మాత్రమే తెలుసనే అహంభావం, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు దూరంగా ఉండిపోవడం, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించడం కంటే వందలు, వేలకోట్లు పెట్టి విలాసవంతమైన భవనాలు నిర్మించడంపైనే ఎక్కువ దృష్టిపెట్టడం, అభివృద్ధి పేరుతో అవినీతి… ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
కానీ తమ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి చెప్పుకోకపోవడం వలననే ఓడిపోయామని కేటీఆర్ నేడు మరో కొత్త కారణం చెప్పారు. కానీ పదేళ్ళ పాలనలో కేసీఆర్తో సహా పార్టీలో ప్రతీ ఒక్కరూ తమ ప్రభుత్వం గురించి సొంత డప్పు కొట్టుకుంటూనే ఉన్నారు. ఎంతగా ప్రజల చెవుల్లో నుంచి రక్తం కారే అంతగా. కేసీఆర్ చిత్ర పాఠాలకు పాలాభిషేకాల ట్రెండ్ కూడా అప్పుడే మొదలైంది.
కేసీఆర్, కేటీఆర్ చేసిన పనులే కాదు… భవిష్యత్లో చేయబోయే పనుల గురించి కూడా డప్పు కొట్టుకుంటూ ‘అడ్వాన్ క్రెడిట్’ కూడా తీసుకునే ప్రయత్నం చేశారు. తమ ఓటమికి అసలు కారణాలు తెలిసి ఉన్నా కేసీఆర్, కేటీఆర్ ఎన్నడూ చెప్పుకోరని, ఒప్పుకోరని స్పష్టం అవుతోంది.
తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి, అనేక సంక్షేమ పధకాలను అమలుచేసిన కేసీఆర్నే ప్రజలు వద్దనుకున్నప్పుడు, సంక్షేమ పధకాల గోల తప్ప మరేమీ చేయని జగన్మోహన్ రెడ్డిని ఏపీ ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు? అని ఆలోచిస్తే వైసీపి ఓటమి ఖాయమని అర్దమవుతుంది. అప్పుడు జగన్, వైసీపి నేతలు కూడా ఇలాగే తమ ఓటమికి కుంటి సాకులు చెప్పుకోకుండా ఉంటారా?ఏమి చెప్పుకుంటారో ఇప్పుడే వింటున్నాము కదా?




