భారీ అంచనాలతో సిద్ధమవుతున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న “జనతా గ్యారేజ్” టీజర్ విడుదల కోసం అభిమానులు, సినీ వీక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన మునుపటి రెండు సినిమాలు ‘మిర్చి, శ్రీమంతుడు’ల కంటే అతి తక్కువ కాలంలో ఈ సినిమా పూర్తి కావస్తుండడం చెప్పుకోదగ్గ విషయం. ఒక రకంగా పూరీ జగన్నాధ్ మాదిరి స్పీడ్ లో ఈ సినిమాను పూర్తి చేసారు కొరటాల.
రంజాన్ సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా టీజర్ పై సినీ జనాలు ఇప్పటికే ‘అవుట్ స్టాండింగ్’ అని టాక్ ఇవ్వగా, తాజాగా ఈ సినిమా ఆడియో హక్కులు రికార్డు ధరకు అమ్ముడు పోయినట్లుగా మరో వార్త హల్చల్ చేస్తోంది. ఇటీవల కాలంలో సిడిలను ఎవరూ పెద్దగా వినియోగించక పోవడంతో, ఆడియో హక్కుల ధరలు అమాంతం తగ్గిపోయాయి. కానీ, “జనతా గ్యారేజ్”కు మాత్రం అదిరిపోయే రేటు వచ్చినట్లుగా తెలుస్తోంది.
దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ సినిమా ఆడియో హక్కులు దాదాపు కోటి రూపాయల పైనే అమ్ముడుపోయినట్లు సమాచారం. కొరటాల శివ – దేవిశ్రీల కాంభినేషన్లో ‘హ్యాట్రిక్’ మూవీగా రానుండగా, ‘నాన్నకు ప్రేమతో’ తర్వాత వరుసగా రెండవ సినిమా జూనియర్ – ప్రసాద్ ల జోడితో రాబోతోంది. ఈ నెల 22వ తేదీన ఆడియో వేడుకను హైదరాబాద్ లో ఘనంగా జరిపేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆడియో హక్కులతో ఓపెన్ అయిన రికార్డుల ఖాతాలో విడుదలయ్యే నాటికి ఎన్ని వచ్చి చేరుతాయో చూడాలి.



