narendra-modi-operation-sindoor

ఆపరేషన్ సింధూర్‌తో భారత్‌ సేనలు పాక్‌పై విరుచుకుపడుతున్నప్పుడు దేశంలో ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలికాయి. పాక్‌కి గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే అని గట్టిగా వాదించాయి కూడా.

Also Read – షర్మిల ఫోన్‌ కేసీఆర్‌ ట్యాపింగ్ చేయిస్తే నాకేం సంబందం?

కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ తాను మధ్యవర్తిత్వం చేసి భారత్‌-పాక్‌ యుద్ధం నిలిపివేశానని, ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని హడావుడిగా ఆ క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నించడంతో అంతా తారుమారు అయ్యింది.

ఆపరేషన్ సింధూర్‌తో ఏం జరిగిందో, పాక్‌ దాడులను భారత్‌ సమర్ధంగా తిప్పికొడుతూనే, పాక్‌ సైనిక స్థావరాలను భారత్‌ ఏవిదంగా దెబ్బ తీసిందో దేశంలో సామాన్య పౌరులు కూడా కళ్ళారా చూశారు. అందుకు అందరూ ప్రధాని మోడీని, త్రివిధ దళాలను ఎంతగానో ప్రశంశిస్తున్నారు కూడా.

Also Read – కవితకి కష్టం వస్తే.. బీసీ రిజర్వేషన్స్‌ లేకుంటే లేదు!

ఆపరేషన్ సింధూర్‌తో ప్రధాని మోడీ ఇమేజ్ అమాంతం ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోతుండటం, కాంగ్రెస్‌ మిత్ర పక్షాలు, దేశంలో ఆయనని తీవ్రంగా వ్యతిరేకించే ఇతర రాజకీయ పార్టీలు జీర్ణించుకోవడం కష్టమే.

కనుక ఇంతవరకు కేంద్రానికి మద్దతు ఇచ్చిన విపక్షాలే, ట్రంప్‌ ఒత్తిడికి తలొగ్గి కాల్పుల విరమణకు అంగీకరించి పాక్‌తో రాజీ పడినందుకు కేంద్రాన్ని విమర్శిస్తున్నాయి.

Also Read – కవిత సిగ్నల్స్.. కేసీఆర్‌ పట్టించుకోవట్లేదే!

అసలు మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్‌తో ఏం సాధించిందో దేశ ప్రజలకు చెప్పాలని నిలదీయడం మొదలుపెట్టాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్షాలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. వారందరికీ ప్రధాని మోడీ సోమవారం రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో జవాబులు ఇచ్చారు.

భారత్‌ సరిహద్దులను ‘టచ్’ చేయడానికే పాక్‌ అపసోపాలు పడితే, భారత్‌ దళాలు పాకిస్థాన్‌లోని కీలకమైన సైనిక, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసిందని చెప్పారు. ఆ దెబ్బతోనే పాక్‌ కాళ్ళబేరానికి వచ్చింది తప్ప తాము ఎవరి ఒత్తిళ్ళకు తలొగ్గి వెనక్కు తగ్గలేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

పాక్‌ మళ్ళీ దాడులకు ప్రయత్నిస్తే ఈసారి చాలా భయంకరంగా ప్రతి దాడి చేస్తామంటూ భారత్‌ సంయమనం కూడా వ్యూహాత్మకమేనని స్పష్టం చేశారు.

భారత్‌ శాంతి కోరుకుంటుందని, కానీ అవసరమైతే ఆ శాంతి తాలూకు శక్తి ఏమిటో చూపించాల్సి వస్తే తప్పక చూపించాలని, తాము అదే చేశామని ప్రధాని మోడీ చెప్పారు.

తద్వారా యూపీఏ-కాంగ్రెస్‌ హయంలో కేంద్ర ప్రభుత్వం పాక్‌ ఉగ్రదాడులు చేస్తుంటే నిసహాయంగా చూస్తూ ఉండిపోయిందనే విషయం ప్రధాని మోడీ తమని విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలకు గుర్తుచేశారు.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ అప్పజెప్పడం తప్ప మరో చర్చ ఉండబోదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. అంటే కాంగ్రెస్‌ నేతలు, విపక్షాలు కలలో కూడా ఊహించలేని అతిపెద్ద లక్ష్యంతో ప్రధాని మోడీ ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశారు.

ఆ లక్ష్య సాధనలో పట్టువిడుపులు అవసరమే కనుక ఆపరేషన్ సింధూర్‌కి బ్రేకులు వేశారు తప్ప పూర్తిగా నిలిపివేయలేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

ఆవేశంతో రగిలిపోతున్న పాక్‌ ఎలాగూ మళ్ళీ భారత్‌పై దాడి చేయకుండా ఉండదు. కనుక అదే ముందుగా తప్పటడుగు వేసేలా చేసి ఆ తర్వాత దానిని ధీటుగా ఎదుర్కొంటే ఈసారి డోనాల్డ్ ట్రంప్‌తో సహా ఎవరూ అభ్యంతరం చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది భారత్‌కు ఎంతగానో కలిసి వస్తుందని కేంద్రం భావిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రసంగం ద్వారా స్పష్టమైంది.

చివరిగా ఒక మాట: భారత్‌పై ఉగ్రదాడులు, క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తున్న పాకిస్థాన్‌ని ఎలాగూ ఎదుర్కోక తప్పదు. కానీ ఇటువంటి క్లిష్ట సమయంలో దేశ భద్రతకు సంబందించిన విషయంలో కూడా దేశంలో ప్రతిపక్షాలు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తూ, పాక్‌ పాలకులు, పాక్‌ మీడియా భారత్‌ని వేలెత్తి చూపేందుకు అవకాశం కల్పిస్తున్నామనే విషయం గ్రహించడం లేదు.




ఆపరేషన్ సింధూర్‌ ద్వారా భారత్‌ గొప్పదనం గురించి పాక్‌ ప్రజలతో సహా ప్రపంచ దేశాలు ప్రశంశిస్తుంటే, ప్రధాని మోడీకి ఇంట్లో ఈ ఈగల మోత, వాటిని ఎదుర్కోక తప్పడం లేదు. అందుకే తమని విమర్శిస్తున్న వారందరికీ ప్రధాని మోడీ ఒక్క ప్రసంగంతో జవాబు ఇచ్చారని చెప్పవచ్చు.