ప్రస్తుతం బెంగళూరులో జరుగుతున్న బిజెపియేతర పార్టీల సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సంచలన ప్రకటన చేశారు.
ఈ రెండు రోజుల సమావేశానికైన వివిద పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ పదవులు, అధికారం కోసం తాపత్రయపడటం లేదు. ఈ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపి దేశాన్ని ముక్కలు కాకుండా కాపాడేందుకే మేము అలుపెరుగని పోరాటం చేస్తున్నాము. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని కాపాడుతూ మళ్ళీ దేశ ప్రజలలో సమైక్యత పెంచడమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం. కనుక ప్రధాన మంత్రి పదవినో లేదా మరేవో పదవులు, అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ ఆశించడం లేదు,” అని ఆయన మాటల సారాంశం.
ఈ సమావేశంలో వివిద రాష్ట్రాలకు చెందిన 26 పార్టీలు పాల్గొన్నాయి. బిహార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు నితీశ్ కుమార్, మమతా బెనర్జీలతో పాటు మరికొందరు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని దేశాన్ని పాలించాలని కలలు కంటున్నారు. అయితే ప్రధాని రేసులో నుంచి ఇప్పుడు కాంగ్రెస్ తప్పుకొన్నందున కూటమిలో మిగిలినవారు కూడా పట్టువిడుపులు ప్రదర్శిస్తూ తమ ప్రధాని అభ్యర్ధిని ఏకగ్రీవంగా ప్రకటించగలిగితేనే వారి కూటమిపై దేశ ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది.
అయితే పదేళ్ళపాటు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని కుర్చీలో కూర్చోమని సోనియా గాంధీ ఎంత బ్రతిమలాడినప్పటికీ రాహుల్ గాంధీ కూర్చోనేందుకు ఇష్టపడలేదు. తీరా చేసి కూర్చోవాలనుకొనేసరికి నరేంద్రమోడీ వచ్చి దానిలో సెటిల్ అయిపోయారు. ఆయనను ఆ కుర్చీలో నుంచి దింపి మళ్ళీ తాను కూర్చోవాలని రాహుల్ గాంధీ పదేళ్ళుగా శ్రమిస్తూనే ఉన్నారు. భారత్ జోడో అంటూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాళ్ళు అరిగిపోయేలా పాదయాత్ర చేశారు కూడా.
కానీ ఇప్పుడు 26 పార్టీలతో ‘మహా ఘట్ బందన్’ కూటమి సిద్దం అవుతుంటే, ప్రధాని పదవి మాకు అక్కరలేదని మల్లిఖార్జున ఖర్గే పుసుకున్న అనేశారు. దీంతో రాహుల్ గాంధీ పదేళ్ళ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది.
అయితే ప్రధాని రేసులో నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకే ఖర్గే ఈ ప్రకటన చేసి ఉండవచ్చు. ఇది చాలా మంచి నిర్ణయమే అని భావించవచ్చు. ప్రతిపక్షాల కూటమి బలంగా నిలబడాలంటే మిగిలిన పార్టీలు కూడా ఇటువంటి త్యాగానికి సిద్దపడక తప్పదు.





