హైదరాబాద్ నగరంలో చాలా ఏళ్ళుగా ఎంఎంటిఎస్ (లోకల్ ట్రైన్) సర్వీసులు నడుస్తున్నాయి. అయినా మరింత మెరుగైన ప్రయాణ సౌకర్యం కోసం మెట్రో రైళ్లు కూడా వేసుకొన్నారు. వాటిని ఏటేటా నగరం నలువైపులకి విస్తరించుకొంటూపోతున్నారు.
ప్రస్తుతం హైటెక్ సిటీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగించేందుకు పనులు ప్రారంభించారు. తాజాగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా నగరం చుట్టుపక్కల జిల్లాలను, పట్టణాలు, గ్రామాలను కలుపుతూ ఔటర్ రైల్వే లైన్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
రూ.26 వేల కోట్ల అంచనా వ్యయంతో నగరం చుట్టూ 563 కిమీ పొడవునా దీనిని నిర్మించబోతున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డిపిఆర్) రూపొందించేందుకు రూ.13.95 కోట్లు, అది చేతికి వచ్చాక భూసేకరణకు అయ్యే ఖర్చులో కేంద్ర ప్రభుత్వం వాటాగా రూ.500 కోట్లు విడుదల చేస్తుందని చెప్పారు.
దీంతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని, భూముల ధరలు కూడా మరింత పెరుగుతాయని కిషన్రెడ్డి చెప్పారు.
ఏపీ రాజధానిగా అమరావతిని నిర్మిస్తున్నప్పుడు కూడా ఔటర్ రింగ్ రోడ్, ఔటర్ రైల్వే లైన్, మెట్రో రైల్ వంటి ప్రతిపాదనలన్నీ సిద్దమయ్యాయి. విజయవాడతో పాటు విశాఖనగరంలో కూడా మెట్రో రైలు ఏర్పాటుకు సర్వేలు, నివేదికలు అన్నీ జరిగాయి.
కానీ ప్రభుత్వం… దానితో పాటు దాని ప్రాధాన్యతలు కూడా మారిపోవడంతో రాష్ట్రానికి కనీసం ఒక్క మెట్రో రైలు కూడా ఏర్పాటుకాలేదు. కనీసం ఎంఎంటిఎస్ రైల్ సర్వీసులకు కూడా దిక్కులేదు. నేటికీ నగరాలలో తిరిగేందుకు ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యాబులు లేదా సొంత వాహనాలే గతి. అయినా రాజధానే లేనప్పుడు మెట్రో లేదని బాధపడటం ఎందుకు?
నిజానికి తెలంగాణ సిఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీ, బిజెపిలపై రోజూ కత్తులు దూస్తుంటారు. అయినా తెలంగాణ రాష్ట్రానికి ఇంత భారీ ప్రాజెక్టు మంజూరు అయ్యింది. బహుశః తెలంగాణ శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే మంజూరు చేసి ఉండవచ్చని సరిపెట్టుకొన్నా, మరో తొమ్మిది నెలల్లో ఏపీలో కూడా ఎన్నికలు జరుగబోతున్నాయి కదా?
పైగా జగనన్న, విజయసాయి రెడ్డి ఢిల్లీ పెద్దలకు విధేయంగానే మెలుగుతుంటారు కదా? అయినా ఏపీకి ఇలాంటి ఒక్క ప్రాజెక్టు కూడా ఎందుకు ఇవ్వడం లేదు? అంటే ‘అడగందే అమ్మయినా అన్నం పెట్టదు’ కనుకనే అనుకోవాలి. మనం ఎంతసేపూ ఇంకా అప్పులు ఇప్పించండనో లేదా కేసుల నుంచి విముక్తి, ఊరట కల్పించమని అడుగుతుంటే, “ఇవిగో ప్రాజెక్టులు…” అని కేంద్రం ఇవ్వదు కదా?అయినా అవి మనకి ఎలాగూ అవసరం లేదు… తెలంగాణకు కావాలంటోంది కనుక దానికే ఇస్తోంది. అందుకు అసూయ పడటం కూడా అనవసరం.



