ఎన్నో అడ్డంకులు, వివాదాలు, నిరసనల మధ్య భారీ అంచనాలతో నేడు విడుదలైన ‘పద్మావత్’కు కోలుకోని దెబ్బ తగిలింది. సినిమా చెప్పుకునేంత రేంజ్ లో లేదని ఓ వైపు రేటింగ్ లు వస్తుండగా… మరోవైపు, ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో సినిమా పడనే లేదు.
సుప్రీంకోర్టు ఉత్తర్వులను, పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రాజ్ పుత్ కర్ణిసేన కార్యకర్తలు విధ్వంసకాండకు దిగడంతో థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు భయంతో వెనుకంజ వేశారు. చిన్నారులతో వెళుతున్న స్కూల్ బస్సులపై కూడా రాజ్ పుత్ లు దాడికి దిగడంతో, చివరకు స్కూళ్లకు కూడా హడావుడిగా సెలవు ప్రకటించారు.
రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో సినిమా షో పడలేదు. దీంతో ఈ సినిమా దర్శకనిర్మాతలకు ఆర్థికంగా కూడా భారీ నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్లు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘బాహుబలి’ రేంజ్ లో విడుదల చేద్దామని భావించిన చిత్ర యూనిట్ కు భారీ షాక్ తగిలినట్లయ్యింది.



