పెద్ద ఉద్యోగం, లక్షల రూపాయల జీతం, పెద్ద ఇల్లు, కార్లు, విలాసవంతమైన జీవితం, బ్యాంక్ బ్యాలన్స్ ఉన్నాయా?లేదా అంటే ప్రతీ ఒక్కరి దగ్గర ఏదో ఓ సమాధానం రెడీగా ఉంటుంది.
ప్రపంచంలో ఎంత మంది బాగా సంపాదించారు? వారి సంపద ఎన్ని లక్షల కోట్లు? వారిలో అత్యంత ధనికుడు ఎవరు.. నంబర్ 1 స్థానంలో ఎవరున్నారు.. రెండో స్థానంలో ఎవరున్నారు?అనే విషయాలపై మీడియాకు, అవి ప్రకటించే జాబితాలపై కూడా చాలా మంది ఆసక్తి చూపుతారు.
కానీ జీవితంలో ఒక్క మొక్క నాటినవారు ఎంతమంది? ఒక్క చెట్టుని పెంచినవారు ఎంత మంది?అంటే ‘బోర్’ అనేసే వాళ్ళే ఎక్కువ తప్ప ఒక్క నిమిషం ఆలోచించి సమాధానం చెప్పేవారు తక్కువ.
మొక్కలు నాటాలంటే మాకు టైమ్ లేదు.. ఉన్నా డబ్బు లేదు.. ఉన్నా ఓపిక లేదు.. ఉన్నా సహకరించేవారు లేరు అని చెప్పేవారే ఎక్కువ.
కానీ కటిక దరిద్రం అనుభవిస్తున్న దర్పల్లి రామయ్యకి ఇవేమీ లేకుండానే ఖమ్మం జిల్లాలో కోటికి పైగా మొక్కలు నాటి అవి చెట్లుగా ఎదిగే వరకు చంటిపిల్లలను సాకిన్నట్లు సాకారు.
ఆయన కృషి, దాని వలన పర్యావరణానికి కలిగిన గొప్ప మేలుని కేంద్ర ప్రభుత్వం గుర్తించి 2017లో ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చింది కూడా. కానీ ఆ అవార్డు, గుర్తింపు ఆయన పేదరికాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయాయి. అలాగే ఆయన నిబద్దతని కూడా.
వృక్షో రక్షతి రక్షితః అంటూ పెద్ద బోర్డు తలకు తగిలించుకొని పాత మోపెడ్ మీద మొక్కలు పెట్టుకొని వెళ్ళి నాటుతూనే ఉన్నారు. ఇంటి పేరు కంటే మొక్కల రామయ్య, వనజీవి రామయ్య అనిపిలిస్తే సంతోషపడే అల్పసంతోషి రామయ్య (85) శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు.
బహుశః ఆయనకు ఎవరూ శద్ధాంజలి ఘటించకపోవచ్చు. కానీ ఆయన చేతిలో పెరిగిన కోటి చెట్ల అరణ్యరోదన ఆయన వినే ఉంటారు.
ఉడతా భక్తిగా రాష్ట్రానికి, దేశానికి జీవితాంతం సేవ చేసి నిశబ్ధంగా వెళ్ళిపోయిన ధన్యజీవి మొక్కల రామయ్యకి నివాళిగా ఒక్క మొక్క నాటి పెంచగలమా?




