జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్ళలో భారీగా అవినీతి జరుగుతోందంటూ ప్రధాని నరేంద్రమోడీకి నేరుగా 5 పేజీల లేఖ వ్రాశారు. టిడ్కో ఇళ్ళలో అవినీతి, అక్రమాల గురించి టిడిపి, జనసేనలు చాలా కాలంగానే ఆరోపణలు చేస్తున్నా వైసీపి ప్రభుత్వం వాటిని ఖాతరు చేయలేదు.
వైసీపి తీరే అంత అని సరిపెట్టుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ హటాత్తుగా ప్రధాని నరేంద్రమోడీకే దీని గురించి నేరుగా లేఖ వ్రాయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. టిడ్కో ఇళ్ళ నిర్మాణాలకి ప్రభుత్వం చెపుతున్న లెక్కలకు వాస్తవ లెక్కలకు ఎక్కడా పొంతన ఉండటం లేదని కనుక దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు.
కొన్ని రోజుల క్రితమే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా టిడ్కో ఇళ్ళపై అనుమానాలు వ్యక్తం చేశారు. కనుక పవన్ కళ్యాణ్ లేఖ వ్రాయడం యాదృచ్ఛికమనుకోలేము.
త్వరలో ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇప్పటికే టిడిపి, జనసేనలు కలిసి పనిచేస్తున్నాయి. కానీ ఏపీ బీజేపీ పరిస్థితే ఇంకా అయోమయంగా ఉంది. కనుక బీజేపీ అధిష్టానం కూడా త్వరగా తమ వైఖరి ఖరారు చేసుకోవలసి ఉంటుంది.
బహుశః బీజేపీ కూడా టిడిపి, జనసేనలతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకొని ఉంటే, అప్పుడు వైసీపి వాటి ఉమ్మడి రాజకీయ శత్రువు అవుతుంది. టిడ్కో ఇళ్ళలో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంటుంది. కనుక వాటిలో అవినీతి జరిగిన్నట్లు అనుమానం కలిగితే సీబీఐ విచారణ జరిపించవచ్చు.
వైసీపికి ఉచ్చు బిగించేందుకు బహుశః ఢిల్లీ పెద్దల సూచన మేరకే పవన్ కళ్యాణ్ ఈ లేఖ వ్రాసి ఉండవచ్చు. ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్ లేఖపై కేంద్రం వెంటనే స్పందించి ఏమైనా చర్యలు తీసుకోవచ్చు. ఆ తర్వాత టిడిపి, జనసేన, బీజేపీల పొత్తుల ప్రకటన ఉండవచ్చు.
నేటికీ బీజేపీ పవన్ కళ్యాణ్ని మిత్రుడుగానే భావిస్తోంది. కనుక సీబీఐ విచారణకు ఆదేశిస్తుందా లేక పవన్ కళ్యాణ్ పిర్యాదును లైట్ తీసుకొంటుందా?త్వరలోనే తెలుస్తుంది.




