ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు. ఆనంద్ సాయి ని సినిమాల్లోకి తీసుకొచ్చింది కూడా పవనే అట. అయితే సినిమాల్లోకి రాకముందు వీరిద్దరూ హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడే ఉండిపోదాం అనుకున్నారట. ఈ విషయం ఆనంద్ సాయి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
“ఒకప్పుడు నేనూ పవన్ కల్యాణ్ అలా అనుకున్న మాట వాస్తవమే. దాని కోసం పెద్ద ప్లాన్ కూడా చేసుకున్నాం, కానీ కుదరలేదు. ఈ లోగా ఆయనకు సినిమా అవకాశం వచ్చి హైదరాబాదు వెళ్లిపోయారు. నేనేమో చెన్నైలో ఉండిపోయా,” అని చెప్పారు. అయితే హిమాలయాలకు వెళ్ళిపోవాలి అనిపించేటంతటి వైరాగ్యం ఎంధుకు వచ్చింది అనేది మాత్రం చెప్పలేదు ఆనంద్ సాయి.
“బ్రైటెన్ ఇనిస్టిట్యూట్లో మాకు పరిచయం అయ్యింది. అప్పట్లో కోయంబత్తూరు నుంచి వచ్చే ఎర్కాడ్ ఎక్స్ప్రెస్ కోసం చెన్నై సెంట్రల్ స్టేషన్లో ఉండేవాళ్లం. ఆ ట్రైన్లో సినిమా వాళ్లంతా చెన్నై వచ్చేవారు. అప్పుడు పవన్ వాళ్లన్నయ్య కోసం ఎదురుచూస్తూ ఉంటే నేను మా నాన్న కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడిని. అక్కడ నుంచి మా స్నేహం ఇంకా బలపడింది,” అన్నారు ఆయన.
అప్పట్లో తనకు బైక్ ఉండేది కానీ, పెట్రోల్కి డబ్బులుండేవి కావని… కల్యాణే పెట్రోల్ పోయించేవారని… అలా ఇద్దరం చెన్నై మొత్తం తిరిగేవాళ్లం అని కూడా ఆయన చెప్పడం విశేషం. యాదాద్రి గుడి ప్రాజెక్టు కోసం చాలా ఏళ్ళు సినిమాలకు దూరమైన ఆనంద్ సాయి తిరిగి పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సినిమాతో తిరిగి సినిమాల్లోకి రానుండడం విశేషం.





