ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం అయ్యి ఉంది. రెండు ప్రధాన పార్టీలు గెలుపు మీద ధీమాగానే ఉన్నాయి. అయితే ఓటర్ల తీర్పు ఏంటి అనేది తెలియాలంటే మరో 22 రోజులు ఆగాల్సిందే. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఆశ్చర్యకరంగా ఉంది. జనబాహుళ్యంలో జనసేన మీద పెద్దగా ఆశలు లేకపోయినా ఆ పార్టీ నేతలు మాత్రం ఏదో ఒక అద్భుతం జరగకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
రాష్ట్రంలోని వేరు వేరు నియోజకవర్గాలలో ఆ పార్టీ నేతలు ఆత్మీయ సమావేశాలు జరుపుకుంటున్నారు. ఈ సమావేశాలలో రాష్ట్రంలో ఒక నిశ్శబ్ద విప్లవం జరిగిందని, దానిని ఏ సర్వే కూడా పట్టుకోలేకపోయిందని కార్యకర్తలకు ధైర్యం నూరిపోస్తున్నారు. కింగ్ అయ్యే అవకాశం లేదు గానీ కనీసం కింగ్ మేకర్ అయినా అవుతారని వారి అంచనా. ఇలా ధైర్యం నూరిపోస్తే గానీ ఏజెంట్లు కౌంటింగు సెంటర్లకు వచ్చే పరిస్థితి ఉండదు గనుక అలా చెప్తున్నారని కొందరి అభిప్రాయం.
పవన్ కళ్యాణ్ అభిమానులలో కూడా ఏ కొందరికో తప్ప ఈ ఎన్నికల మీద ఆశలు లేవు. వన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు సీట్లలో గెలుస్తారా అంటే కూడా చెప్పలేని పరిస్థితి. జనసేన రెండంకెల సీట్లు సాధిస్తే ఆ పార్టీకి మంచి ఫలితాలు వచ్చినట్టే. అలా జరగని పక్షంలో మాత్రం ఆ పార్టీ మనుగడే కష్టం. పవన్ కళ్యాణ్ తన రెండు సీట్లలో గెలవకపోతే ఆయనపై తిరిగి సినిమాలు చెయ్యాలనే ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో జనసేన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాలి.



