ఆంధ్రప్రదేశ్ లో ‘కాపు’ పేరిట రాజకీయం ఊపందుకున్న నేపధ్యంలో… అదే సామజిక వర్గానికి చెందిన స్టార్ హీరోగా మరియు ‘జనసేన’ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ పైన కూడా తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలు చేసారు. కమ్యూనిస్టు పార్టీలు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేస్తూ, ఈ ఉద్యమంలో భాగస్వామి కావాలని కోరగా, అదే బాటలో మిగిలిన రాజకీయ నేతలు కూడా స్పందించారు. అయితే కాపు ఉద్యమానికి బాసటగా నిలిచినా, లేకున్నా ముద్రగడ పద్మనాభంను పరామర్శించాలని పవన్ భావించినట్లుగా ప్రచారం జరుగుతోంది.
అయితే ముద్రగడ దీక్ష చేపట్టి దాదాపు ఎనిమిది రోజులు గడిచినా… ఇంతవరకు పవన్ జాడ లేదు. అయితే ముద్రగడ వద్దకు రావాలనుకున్న పవన్ ను… సినీ పరిశ్రమకు చెందిన తన సన్నిహితుడు ఒకరు ఆపినట్లుగా తెలుస్తోంది. “ఈ సమయంలో ముద్రగడ వద్దకు వెళితే, అది ప్రస్తుతం రగులుతున్న కాపు రాజకీయంలో నువ్వు కూడా బలిపశువు అవుతావని, మీ సోదరుడు చిరంజీవి మాదిరే ఒక కులపు నాయకుడిగా ముద్ర పడుతుందని, ఈ అంశానికి మాత్రం మీరు బహు దూరంగా ఉండండి…” అంటూ హితబోధ చేసినట్లుగా సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
దీంతో జగన్, చిరంజీవి, దాసరిల ఆధ్వర్యంలో జరుగుతున్న కుల రాజకీయాలకు దూరంగా తన కొత్త సినిమా షూటింగ్ ను సైలెంట్ గా కానిచ్చేస్తున్నారని టాక్. ఎవరి వలన రాకపోయినా గానీ, ఈ కాపు ఉదంతంలో వేలు పెట్టకుండా పవన్ ఓ మంచి పనే చేసారని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఇది భవిష్యత్తులో పవన్ పొలిటికల్ కెరీర్ లో కీలకమైన పరిణామంగా కూడా అభివర్ణిస్తున్నారు.



