‘ఆలు లేదు, సూలూ లేదు… అల్లుడేమో సోమలింగం…’ అన్న నానుడి తెలిసిందే కదా! గత నాలుగేళ్ళుగా జగన్ ఇదే సామెతను అనుసరిస్తూ… ‘తానే రాజు… తానే మంత్రి…’ అన్న ఊహలలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. టిడిపి – వైసీపీకి మధ్య తేడా కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే, అవే ఇటు పడుంటే తానే ముఖ్యమంత్రిని అయ్యేవాడిని, అంటూ ‘ముఖ్యమంత్రి’ సీట్ లో కూర్చోవాలన్న తాపత్రయాన్ని ఎన్నో సార్లు మరెన్నో సందర్భాలలో జగన్ వ్యక్తపరిచారు.
ఇటీవలే ఇలాంటి డైలాగ్ లకు శుభంకార్డు పడింది. ఎందుకంటే మరో ఏడాదిలో ఎలాగూ ఎన్నికలు ఉన్నాయి గనుక, ప్రస్తుతం అధికార ప్రభుత్వంపై విమర్శలే లక్ష్యంగా చేసుకుని జగన్ పాదయాత్ర చేస్తున్నారు. ఈ తరుణంలో ‘పోరాటయాత్ర’ అంటూ బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేతకు నిద్ర లేకుండా చేస్తున్నారని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. జనసేన అధినేత ప్రసంగాలు కూడా కేవలం చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేసుకుంటూ వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా… గత ఎన్నికలలో తాను చంద్రబాబు తరపున ప్రచారం చేయడం వలనే ముఖ్యమంత్రి అయ్యారని, మీ ప్రభుత్వం ఏర్పడడానికి, నిలబడడానికి తానే కారణం అంటూ చేస్తోన్న ప్రగల్భాలు తెలియనివి కావు. అయితే ఈ వ్యాఖ్యలపై టిడిపి నాయకులు విమర్శలు మాత్రమే చేస్తున్నారు, కానీ వైసీపీ నేతలు మాత్రం ‘పవన్ ఆ పని చేసి ఉండకపోతే’ అంటూ సినీలెవల్లో పళ్ళు నూరుకుంటున్నారట. అసలే ముఖ్యమంత్రిని అయిపోయినట్లు ఊహించుకునే జగన్ కు పవన్ వ్యాఖ్యలు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
జగన్ పాలన వస్తే రాష్ట్రమంతా ఫ్యాక్షనిజం అలుముకుంటుందని, రాష్త్రం మొత్తం దోచేస్తారని పవన్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. గడిచిన కొన్ని రోజులుగా కూడా ఈ వ్యాఖ్యలను పవన్ గుర్తు చేసుకున్నారు. నాడు పవన్ గనుక అలా అడ్డం తిరిగకపోతే ‘జగన్ మోహన్ రెడ్డి అనే నేను’ అన్న మాటలు జగన్ నోటి వెంట వచ్చేవన్నది వైసీపీ అభిమానుల ఆవేదన. అయితే ఈ సారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుండడం జగన్ మోహన్ రెడ్డి అభిమానులకు కొంత ఊరట చెందే అంశం.



