గతంలో ప్రత్యేక ప్యాకేజీ ని రెండు పాచిపోయిన లడ్డులు అని, ప్రత్యేక హోదా కావాలంటూ నినదించిన పవన్ కళ్యాణ్… ఆ తరువాత ఆ విషయం పై రాజీపడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ తరువాత ఆ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. తాజాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ రాజీ పడినట్టుగా ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఒక్క వైజాగ్ స్టీల్ ను దృష్టిలో ఉంచుకుని ప్రైవేటీకరణకు వెళ్లడం లేదని, అనేక ప్రభుత్వ సంస్థలు నష్టాలలో కూరుకుపోతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. ప్రైవేటైజేషన్ విషయంలో మున్సిపల్ ఎన్నికలలో లబ్ది కోసం వైఎస్సార్ కాంగ్రెస్ నిరసన యాత్రలు చేసిందని ఆయన విమర్శించారు.
22 మంది ఎమ్.పిలు ఉండి ఢీల్లీలో దీనిపై ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. అయితే తాము కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసి ఇది ఆత్మగౌరవ సమస్య అని వివరించామని ఆయన అన్నారు. విశాఖ స్టీల్ తో ఎపికి ఉన్న అనుబంధాన్ని గమనంలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని వినతిపత్రం సమర్పించామని ఆయన చెప్పారు.
ఇదంతా బానే ఉంది… పవన్ కళ్యాణ్ పర్యటన వల్ల ఉపయోగం ఏముంది? వినతిపత్రం సమర్పించడం అంటే ఒత్తిడి పెంచడం కాదు కదా? వినతిపత్రాల కారణంగా పనులు అయిపోతే బానే ఉంటుంది. కానీ అవ్వలేదు కదా? అనేక ప్రభుత్వ సంస్థలు నష్టాలలో కూరుకుపోతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పడం పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని కూడా వదిలేసినట్టే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.





