పవన్ కళ్యాణ్… కళ్ళు తెరవాల్సిన సమయం..!

Pawan Kalyan has to change his mind set‘ప్రత్యేక ప్యాకేజ్’ను కేంద్రం ప్రకటించిన సమయంలో చేపట్టాల్సిన ఆందోళనను, నాలుగైదు నెలల పాటు తాత్సారం చేసి, ఇప్పుడు కొత్తగా ‘ప్రత్యేక హోదా’ అంటే దానికి అర్ధముంటుందా? ప్రస్తుతం ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ చేస్తోంది కూడా అదే. ఆందోళన చేయాల్సిన సమయంలో… నేను ఆ టైపు కాదంటూ కాలయాపన చేసిన పవన్, ఇప్పుడేమో ‘ఎందుకు ఇవ్వరు?’ అంటూ ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి. ఎవరు ఒప్పుకున్నా… లేకున్నా… ఏపీకి దక్కాల్సిన ‘స్పెషల్ స్టేటస్’ అనేది వెంకయ్య నాయుడు చెప్పినట్లు ముగిసిపోయిన అధ్యాయం.

ఆ మాటకొస్తే ఒక్క ఏపీకే కాదు, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంతో దేశంలో అన్ని రాష్ట్రాలకు ‘స్పెషల్ స్టేటస్’ అనేది దూరం కానుంది. ఈ విషయం పవన్ కళ్యాణ్ కు మరియు ప్రతిపక్ష పార్టీలకు తెలియదా? అంటే తెలుసనే సమాధానమే వస్తుంది. మరి తెలిసి కూడా ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? అంటే దానికి సమాధానమే… రాజకీయ లబ్ది. 2019 ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత ఓటుగా ‘స్పెషల్ స్టేటస్’ అంశాన్ని వినియోగించుకుంటున్నారని అర్ధమవుతోంది. ఒకప్పుడు జగన్ మాత్రమే ఈ రాజకీయ లబ్ది కోసం ప్రాకులాడగా, ప్రస్తుతం ‘జనసేన’ అధినేత కూడా తోడైనట్లు కనపడుతోంది.

ADVERTISEMENT

సీఐఐ సమ్మిట్ రీత్యా ‘మౌన ప్రదర్శన’ను కేవలం మూడు రోజులు మాత్రమే వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరితే, పవన్ ఏకంగా 30 రోజుల పాటు తమ మౌన ప్రదర్శనను వాయిదా వేసుకుని, తన చిత్తశుద్ధి ఏమిటో చాటిచెప్పుకున్నారు. బహుశా ‘ప్రత్యేక హోదా’ ముగిసిపోయిన అధ్యాయం అని పవన్ కూడా అంగీకరించారో ఏమో గానీ, తాజాగా మార్చిలో జరగబోయే నిరసనకు “దక్షిణ భారత ఆత్మ గౌరవ సభ” అని నామకరణం చేసారు. ఇప్పటికే అనేక కష్టాలతో మునిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా, ఈ ఉత్తర – దక్షిణ తారతమ్యాలు సృష్టించడం ఏమిటో అర్ధం కాని పరిస్థితి.

2019 ఎన్నికల వరకు ఏదొక ఉదంతంతో కాలయాపన చేయాలన్న తాపత్రయం తప్ప, రాష్ట్ర పరిస్థితిని, రాష్ట్ర ప్రభుత్వ స్థితిగతులను అర్ధం చేసుకుని వ్యాఖ్యానిస్తే… వాటికి మిక్కిలి ప్రాధాన్యత దక్కుతుంది. పందులతో పోల్చి సుజనా చౌదరి టంగ్ స్లిప్ అయినప్పటికీ, వాటికి క్షమాపణలు చెప్తూ… స్పెషల్ స్టేటస్ అనే విషయం మరిచిపోవాల్సిందిగా చెప్పడంలో ఎంతో వాస్తవికత ఉంది. ఒకప్పుడు ఢిల్లీలో చెప్పడం కాదు, ఏపీకొచ్చి చెప్పాలని వెంకయ్య నాయుడుని పదే పదే పవన్ రెట్టించిన సందర్భాలున్నాయి.

ఆ తర్వాత ఏం జరిగింది. ఒక్క వెంకయ్య నాయుడే కాదు, ఇప్పటివరకు చాలామంది నేతలు ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఏపీలోనే వెల్లడించారు. మరి కనీసం అప్పుడు ఒక్క మాటైనా మాట్లాడని పవన్, ఇప్పుడు లేనిపోని గందరగోళం సృష్టించడం ఎందుకు? నిలకడలేని వ్యాఖ్యలకు పవన్ నిదర్శనంగా మారుతున్న తరుణంలో… తాజాగా చేస్తోన్న ట్వీట్లన్నీ, కేవలం రొటీన్ రాజకీయ విమర్శలలో కొట్టుకుపోతున్నాయే తప్ప, ప్రయోజనం మాత్రం శూన్యం. దీంతో ఇకనైనా పవన్ కళ్ళు తెరిచి ప్రవర్తించాల్సిన సమయం ఆసన్నమైంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ADVERTISEMENT
Latest Stories