కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన గడువు నేటితో పూర్తి అవుతుంది. ఇరువైపుల వారు పవన్ కళ్యాణ్ అడిగిన లెక్కలు ఇవ్వడానికి సిద్ధంగా లేనట్టు ఇప్పటికే స్పష్టం చేసాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ పై టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది.
‘పవన్ వేసిన కమిటితో మనకు ఇబ్బంది లేదు. మనవైపు నుండి అంతా క్లియర్ గా ఉంది. పవన్ పోరాటంలో అర్థం ఉంది. రాష్ట్రానికి మేలు చేయాలని పవన్ పోరాటం చేస్తున్నారు.’’ అని నేతలతో చంద్రబాబు చెప్పారు. అదే సమయంలో శ్వేత పత్రం ఇవ్వాల్సింది కేంద్రమేనని, రాష్ట్ర ప్రభుత్వం కాదని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు.
జనసేనతో ఘర్షణకు దిగవద్దని, శ్వేత పత్రం అడిగితే సున్నితంగా సమాధానం చెప్పాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. అయితే పవన్ కళ్యాణ్ పట్ల చంద్రబాబు మెతక వైఖరిని తెలుగు తమ్ములు జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్నటి ప్రెస్ మీట్లో పోలవరం లెక్కలు నాకే ఇవ్వలేదు ప్రభుత్వం అనడం ఆయన దొరణాన్ని తెలుపుతుందని వారు అంటున్నారు.
“నాకే ఇవ్వలేదు అనడం ఏంటి? ఆయనేమన్న దిగివచ్చాడా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనకు లెక్కలు చెప్పడమేంటి? ఇది రాజ్యాంగ వ్యతిరేకం కదా? అంతగా కావాలంటే ఆర్టీఐ ద్వారా అడగాలి. ఇంత జరుగుతున్నా చూసి చూడనట్టు వదిలేస్తే రేపు ఇంకో రకంగా ఇబ్బంది అవ్వొచ్చు. దానిని చంద్రబాబే పెంచి పోషించినట్టు అవుతుంది,” అని టీడీపీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు.



