తెలుగు రాష్ట్రాలు భౌగోళికంగా రెండుగా విడిపోయినప్పటికీ, ఓ రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలు మరో రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పొరుగు రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు? ఎవరు ఉండాలి?అనేది నిర్ణయాత్మకంగా మారింది.
ఉదాహరణకు కేసీఆర్ తెలంగాణ సిఎంగా ఉన్నప్పుడు తెలంగాణలో టీడీపిని తుడిచిపెట్టేయడంతో ఆగకుండా ఏపీలో కూడా అధికారంలో ఉండకూడదనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డితో కలిసి పావులు కదిపి గద్దె దించారనేది బహిరంగ రహస్యం.
ఏపీ సిఎంగా చంద్రబాబు కంటే జగన్మోహన్ రెడ్డి ఉండటమే ఎందుకు అవసరమని కేసీఆర్ అనుకున్నారో, ఆయన కోరుకున్నట్లు జగన్ సిఎం అయితే ఏం జరిగిందో అందరికీ తెలుసు.
ఏపీ రాజకీయాలలో వేలుపెట్టి తనని గద్దె దించినందుకు చంద్రబాబు నాయుడు ఆవేశంతో ఊగిపోలేదు. ఎవరి మీద చిందులు వేయలేదు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో టీడీపి పోటీ చేయకుండా నిలిపివేశారు.
అందుకు బీఆర్ఎస్ నేతలు సంతోషించాలి కదా? కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకే టీడీపి బరిలో నుంచి తప్పుకుందని వాదించారు. వారి వాదనలే నిజమని రుజువైంది. ఆవిధంగా చంద్రబాబు నిశబ్దంగా కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తే పుచ్చుకోక తప్పలేదు.
ఈ కథ అంతా అందరికీ తెలిసిందే.
కానీ ఇక ముందు జరుగబోయేదే అసలైన కథ. ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ఇద్దరూ ఓడిపోయారు. వారిరువురి ఓటమికి చంద్రబాబు నాయుడే ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులు. కనుక ఈసారి వారు కూడా ఆయనకు ‘రిటర్న్ గిఫ్ట్’ ఇవ్వాలని ఆశ పడటం సహజం. కానీ వారివద్ద అటువంటి ప్లాన్స్ ఏవైనా ఉన్నాయో లేదో ఎన్నికలు దగ్గర పడితే గానీ తెలీదు.
ప్రస్తుతానికి మాత్రం చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాల వైఫల్యాలతో తాము మళ్ళీ అధికారంలోకి రాగలమని బీఆర్ఎస్, వైసీపీలు ఆశపడుతున్నాయి. ఇలాంటి ఆశలు సంతోషాన్నిస్తాయి కానీ గెలిచేందుకు ఉపయోగపడవు.
కనుక రెండు పార్టీలు ఏపీలో చంద్రబాబు నాయుడుని, తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఏవిధంగా ఓడించాలనే ఆలోచనలు కూడా చేయక తప్పదు. వాటి ఏకైక ఆశాజ్యోతిగా బిజేపి ఒక్కటే కనిపిస్తోంది.
తెలంగాణలో బిజేపి అధికారంలోకి రావాలని తహతహలాడుతోంది కనుక తమతో తప్పక చేతులు కలుపుతుందని బీఆర్ఎస్ పార్టీ ఆశలు పెట్టుకొని ఉండవచ్చు. బిజేపితో బహిరంగంగా పొత్తు పెట్టుకోవడానికి వెనకాడుతున్న జగన్, బిజేపితో లోపాయికారీ సహాయసహకారాలకు సిద్ధంగానే ఉంటారని పలుమార్లు నిరూపించుకున్నారు.
కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ని కాదని బిజేపి అధిష్టానం కేసీఆర్, జగన్లతో చేతులు కలపాల్సిన అవసరం కనిపించడం లేదు. ఒకవేళ కలిపినా దాని వలన బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోవచ్చు తప్ప దానికి పదవి, అధికారం, పూర్వ వైభవం రాకపోవచ్చు.
కనుక వచ్చే ఎన్నికలలో కూడా కేసీఆర్, జగన్ పరస్పరం సహకరించుకోక మానరు. కానీ అదొక్కటే సరిపోదు. వారికీ ఓ గేమ్ చేంజర్ అవసరం. ఆ గేమ్ చేంజర్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లతో ఉన్నారు.
తెలంగాణలో బిజేపి ఎటువైపు మొగ్గు చూపుతుందనేది చాలా కీలకం. కనుక వచ్చే ఎన్నికలలో అదే గేమ్ చేంజర్ నిలిచే అవకాశం కనిపిస్తోంది.




