దేశరాజకీయాల్లో సొంత అభిమానులకు, కార్యకర్తలకు అర్థంకానీ రాజకీయనాయకుడు ఎవరైనా ఉంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే అని సోషల్ మీడియాలో ఎవరో పెట్టారు. అభిమానులు తమ నాయకుడి మీద ఉన్న ప్రేమతో కాదని బుకాయించినా ప్రస్తుత పరిస్థితుల్లో అది అక్షరసత్యం అనే అనుకోవాలి.
పనిగట్టుకుని వెళ్లి కేసీఆర్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి మీడియా ముందు ఆయనను పొగిడిరావడం ఏంటో ఎవరికీ అర్ధం కాలేదు. ఆంధ్రప్రదేశ్ లో వైకాపాకు ఇటు తెలంగాణాలో కాంగ్రెస్ కు వ్యతిరేకమని ప్రకటించుకుని అధికారంలో ఉన్న పార్టీలతో అంటకాగుతుంది జనసేన. గతంలో ప్రజారాజ్యం పార్టీకి కూడా ఇదే రకం జాడ్యం.
ఎంతసేపు అప్పటి ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశంనే టార్గెట్ చేసేవారు ప్రజారాజ్యం పార్టీ వారు. విలీన ఒప్పందం ముందే కుదిరిందా అనే అనుమానం జనాలకు తరువాత కలిగింది. అధికారంలోకి రావాలనుకునే కొత్త పార్టీలు అధికారంలో ఉండేవారితో కాకుండా ప్రతిపక్షంతో పోరాడితే ఎలా అది పదవిలో ఉన్న వారికి లాభం చేకూరుతుందో 2009 లో చూసాం.
అప్పటి ప్రజారాజ్యం వారికి నాలుగు పదవులు, చిరంజీవికి కేంద్రంలో మంత్రి పదవి దక్కినా దాదాపుగా ఆయనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా అయిపోయింది. మరి ఇప్పుడు అదే పంథాలో పయనిస్తున్న జనసేన భవిష్యత్తు ఏమవుతాదో? పవన్ కళ్యాణ్ ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది



