“ఆలు లేదు… సూలు లేదు… అల్లుడేమో సోమలింగం…” అన్నాడట వెనుకటికొకడు. అలా ఉంది ఒక సినీ నిర్మాత కేతిరెడ్డి వ్యాఖ్యలు. ప్రిన్స్ మహేష్ బాబు + పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లను పెట్టి ఒక సంచలనమైన మల్టీస్టారర్ సినిమాను నిర్మిస్తారట. అది ‘బాహుబలి’ సినిమాను కూడా దాటేస్తుందట. అంతేకాదు, ప్రపంచంలోని అన్ని భాషలలో విడుదల చేస్తారట. అప్పుడు కూడా సూపర్ హిట్ అవుతుందంట. ఇదంతా కూడా తన 25 ఏళ్ళ సినీ ప్రస్థానానికి గుర్తుగా ఈ సినిమాను నిర్మించనున్నారట.
ఒక ప్రముఖ దర్శకుడిని ఈ సినిమా కోసం ఎంపిక చేయనున్నారట. ఇందుకోసం ఇప్పటికే ఓ స్క్రిప్ట్ ను తయారు చేసుకున్నారట. త్వరలోనే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లను కలిసి ఈ స్క్రిప్ట్ చెప్పి అనుమతి తీసుకోబోతున్నారట. ఇదంతా విన్నాకా ఎవరికైనా కాస్త నవ్వు రావడం ఏ మాత్రం తప్పు కాదు. అయితే ఇంత ప్రకటన చేయడానికి గల కారణం… గతేడాది రజనీకాంత్ మరియు మహేష్ బాబు కాంభినేషన్ లో ఒక సినిమా ప్లాన్ చేసారు… అది కూడా మహేష్, రజనీల ఇద్దరి అనుమతితో..!
మరి ఏడాది గడిచిందిగా… ఇంకా ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు అన్న సందేహం వస్తే తప్పే! మహేష్ ‘బ్రహ్మోత్సవం’ ఇప్పటికే విడుదల కాగా, మరికొద్ది రోజుల్లో రజనీ ‘కబాలి’ విడుదల అవుతోందిగా..! అయితే వీళ్ళిద్దరిని ఒకే సినిమాలో నటింపచేయడానికి ముందు సంచలనమైన మహేష్ + పవన్ జోడి సెట్ చేయబోతున్నారు. ఏమైనా జరిగే పనులుంటే చెప్పండయ్యా… అంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్లకు కొదవలేదు మరి..!



