రాజకీయ నాయకులకు రెండు నాలుకలు ఉంటాయట. వాటిలో ఎప్పుడు ఏది కావాలంటే అది వాడుకోవడంలో వారు సిద్ధ హస్తులు. కొందరు తాము వాటికి అతీతులం అని చెప్పుకుని రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు కాకపోతే అందులో చాలా మంది అవన్నీ ఉత్తుత్తి మాటలే అని వెంటనే నిరూపిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంగతేంటో తేలాలి మరి.
ఆంధ్ర, తెలంగాణా విషయంలో పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడులాగా రెండు కళ్ల సిద్ధాంతంతో ఉన్నట్టు ఉన్నారు. కొద్దీ నెలల క్రితం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు తాను 11 రోజులు తిండి మానేశా అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడా అన్నట్టు మాట్లాడుతున్నారు.
2014 ఎన్నికలలో ఖబడ్దార్ కేసీఆర్ అని హుంకరించిన పవన్ కళ్యాణ్ కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని అంటున్నారు. ఫిరాయింపులు తప్పు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏకంగా ఇప్పుడు కేసీఆర్ అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసారు అని ఫిరాయింపులకు కొత్త భాష్యం చెప్తున్నారు జనసేనాని.
తెలంగాణ నేల తల్లికి ఆఖరిశ్వాస వరకు రుణపడి ఉంటానని ఆయన అన్నారు. జైతెలంగాణ నినాదం వందేమాతరం అంతటి గొప్ప వాక్యమని చెప్పుకొచ్చారు. ఈ మాటలు ఆంధ్ర నేల మీద చెప్పగలరా అనేది చూడాలి. 27 నుండి ఆయన 2-3 రోజుల పాటు అనంతపురంలో పర్యటించనున్నారు. అప్పుడు ఏమని మాట్లాడతారో చూడాలి.



