జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో వివిద వర్గాల ప్రజలతో ముఖాముఖీ సమావేశాలలో పాల్గొంటున్నారు. ముస్లింలతో సమావేశమైనప్పుడు, వారు బిజెపితో జనసేన పొత్తు గురించి ప్రశ్నిస్తూ, ముస్లింలని వ్యతిరేకించే బిజెపితో పొత్తు పెట్టుకొంటున్న మీకు ఎందుకు ఓట్లు వేయాలని సూటిగా ప్రశ్నించారు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన సమాధానం సంతృప్తికరంగానే ఉంది. కానీ బిజెపితో కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నారని సూచనప్రాయంగా చెప్పిన్నట్లయింది.
“రాజకీయ పార్టీలు వాటి నేతల కంటే ఈ దేశం, సమాజమే ముఖ్యం. అదే… వివిదవర్గాల ప్రజలను ప్రభావితం చేస్తుంటుంది. ముస్లింలు నేటికీ తమను తాము మైనార్టీలని భావిస్తుండటం సరికాదు. జనాభాపరంగా మీరు తక్కువ కావచ్చు కానీ ఈ సమాజంలో అందరితో సమానమే.
నేను బిజెపితో పొత్తులు పెట్టుకొన్నానని మీరు జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఆయనను గెలిపించారు. కానీ ఆయన పాలనలో మీరందరూ ఇబ్బందులు పడుతున్నారు. కనుక నేతల కులం, మతం చూసి కాకుండా వారి గుణం, ఆశయాలు చూసి ఓట్లు వేస్తే ఈవిదంగా నష్టపోరు.
నేను బిజెపిని గుడ్డిగా ఏమీ నమ్మలేదు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర ప్రయోజనాలు, అవసరాలు, నా శక్తిసామర్ధ్యాలు అన్నీ లెక్కకట్టుకొనే బిజెపితో పొత్తులు పెట్టుకొన్నాను. అయితే మా పొత్తులు రాష్ట్ర ప్రయోజనాల కోసమే కానీ ఎవరికీ నష్టం కలిగించబోవని నేను హామీ ఇస్తున్నాను,” అని చెప్పిన్నట్లు తెలుస్తోంది.
అంటే జనసేన, బిజెపిలు కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నాయని స్పష్టం అవుతోంది. ఈ విషయం పవన్ కళ్యాణ్ బహిరంగసభలలో చెప్పనప్పటికీ, ‘జనసేన మాతోనే ఉందని’ ఏపీ బిజెపి నేతలు చెపుతూనే ఉన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా మంగళగిరిలో పార్టీ నేతలని ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ “వచ్చే ఎన్నికలలో 175 సీట్లకు పోటీ చేయబోతున్నాము. అన్ని సీట్లు గెలుచుకొనేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని” అన్నారు. అంటే టిడిపి వాటితో కలవడంలేదని భావించవచ్చు.
అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విస్పష్టంగా పొత్తుల గురించి ప్రకటించేవరకు ఈ మాటలను వైసీపీని తికమక పెట్టేందుకు ఆ పార్టీల వ్యూహాలుగానే పరిగణించక తప్పదు.



