ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ జగనన్న భజనే చేయాలి… ఆయన నిర్ణయాలు నచ్చకున్నా జేజేలు పలుకుతుండాలి… ఆయన చెప్పిందే నిజమని నమ్మాలి… వైసీపి రంగులే వేసుకోవాలి. కాదంటే మాజీ ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు అంతటివారికే కష్టాలు తప్పడం లేదు. ఇక సినీ పరిశ్రమలోనివారు ఏవిదంగా వైసీపి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించగలరు?ప్రశ్నించగలరు?అందుకేసినీ పరిశ్రమలో చాలా మంది మౌనంగా ఉండిపోక తప్పడం లేదు.
దేశంలోకే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహేబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రబాబు నాయుడు గురించి రెండు మంచి ముక్కలు మాట్లాడినందుకే, ఏపీ మంత్రులు ఆయన పట్ల ఎంత అనుచితంగా మాట్లాడారో అందరికీ తెలుసు. కనుక చంద్రబాబు నాయుడు అరెస్టుపై సినీ పరిశ్రమలో ఎవరూ స్పందించనందుకు తప్పు పట్టడం సరికాదని పవన్ కళ్యాణ్ అన్నారు.
మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “సినీ పరిశ్రమ పైకి కనిపిస్తున్నట్లు చాలా బలమైనది, ప్రభావంతమైనదేమీ కాదు. చాలా బలహీనమైనది. కనుక సినీ పరిశ్రమలో ఉన్నవారికి నిశ్చిత రాజకీయ అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఎవరూ ధైర్యం చేసి బయటకు మాట్లాడలేరు. ఒకవేళ మాట్లాడితే రజినీకాంత్ వెంటపడిన్నట్లు ఏపీ మంత్రులు వారి వెంటకూడా పడి వేధిస్తారు.
నేను మొండివాడిని పైగా రాజకీయాలలో కూడా ఉన్నాను. కనుక ధైర్యంగా జగన్ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నిస్తున్నాను. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను విమర్శిస్తూ కోటా శ్రీనివాసరావు, పృధ్వీ వంటివారు సినిమాలు చేశారు. కానీ ఎన్టీఆర్ వాటిని వారి రాజకీయ అభిప్రాయాలుగానే భావించారు తప్ప ఏనాడూ వారిపై ఈవిదంగా కక్ష సాధింపులకు ప్రయత్నించలేదు.
కానీ జగన్ ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వారిపై తప్పుడు కేసులు బనాయించి వేధించడం మొదలుపెట్టేస్తారు. అందుకే రాష్ట్ర రాజకీయాలపై సినీ పరిశ్రమ స్పందించాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.



