వైసీపి అధినేత జగన్తో సహా ఆ పార్టీ నేతలు జనసేన మాకు పోటీయే కాదని గొప్పలు చెప్పుకొంటారు. కానీ జనసేనను రాజకీయంగా ఎదుర్కొలేకపోతున్నందుకో లేదా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని వివిద వర్గాలను ప్రభావితం చేస్తున్నారనే భయమో లేక పవన్ కళ్యాణ్ వస్తున్నట్లు తెలియగానే వేలాదిమంది స్వచ్ఛందంగా తరలివస్తున్నారనే అసూయో… కారణం ఏదైనప్పటికీ జగన్తో సహా వైసీపి నేతలందరూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి చాలా చులకనగా లేఖిగా మాట్లాడుతుంటారు.
అలనాడు హిరణ్యకశిపుడు శ్రీమహావిష్ణువుని ఈవిదంగానే చాలా ద్వేషించేవాడు. నిత్యం శ్రీమహావిష్ణువునే తలుచుకొని భయపడుతుండేవాడు. చివరికి శ్రీమహావిష్ణువు చేతిలోనే హిరణ్యకశిపుడు మరణించాడు. వైసీపి అధినేత తీరు కూడా అచ్చం అలాగే ఉంది. కనుక వైసీపి ముగింపు కూడా పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉందనుకోవచ్చు.
అయితే జగన్ చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ చాలా హుందాగా, సంస్కారవంతంగా స్పందించడం విశేషం.
“జగన్ నీ అంత నీచస్థాయికి నేను దిగజారిపోలేను. నేను కూడా నీ పద్దతిలోనే జవాబు చెప్పగలను. కానీ నేను ఓ మాట అంటే నీ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో గ్రహించి మాట్లాడటం లేదు. ఎందుకంటే మీరందరూ మాట్లాడుతున్న మాటలతో మా ఇంట్లో ఆడవాళ్ళు ఎంతగానో బాధపడుతుంటారు. అందుకే నేను ఏనాడూ భారతీ మేడంగారు, నీ పిల్లలు బాధపడేలా మాట్లాడలేదు. మాట్లాడబోను కూడా.
మాఫియా, ఫ్యాక్షన్ నేతలు కూడా ఎన్నడూ ఆడవాళ్ళ జోలికి పోరు. ఒకప్పుడు మొఘలాయిల పాలనలో కూడా ఛత్రపతి శివాజీ వంటివారు వారి ఆడవాళ్ళని తల్లితో సమానంగా గౌరవించేవారు. ఇదీ మన దేశ గొప్ప సంస్కృతి. కానీ ఈ జగన్, వైసీపి నేతలు మాత్రం ప్రతిపక్ష నేతల ఆడవాళ్ళని కూడా విడిచిపెట్టడం లేదు. వాళ్ళనీ బజారుకీడ్చుతున్నారు.
నేను రాజధాని, సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్రాభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు ఉపాధి అవకాశాల గురించి అడుగుతుంటే వాటికి జవాబు చెప్పలేక జగన్, వైసీపి నేతలు నా వ్యక్తిగత జీవితం గురించి, ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు.
జగన్! నువ్వు ఓ సంస్కారహీనుడివి. ఈ ముఖ్యమంత్రి పదవికి ఏమాత్రం అర్హుడివి కావు,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.



