‘జనసేన’ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా రావడం, ఉద్దానం ప్రజల సమస్యలపై స్పందించడం, రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించడం తదితర సంగతులు తెలిసినవే. అయితే ఈ పర్యటన వలన పవన్ కు చేకూరిన ప్రయోజనం ఏంటి? అంటే వైజాగ్ లో ఎయిర్ పోర్ట్ లో దిగిన దగ్గర నుండి నేడు జరిగిన రోడ్ షో వరకు ప్రజలు అడుగడుగునా పవన్ కు నీరాజనాలు పలికారు.
సహజంగా హంగు, ఆర్భాటం లేకుండా వచ్చిన పనేంటో చూసుకుని వెళ్ళిపోయే పవన్, భారీ స్థాయిలో రోడ్ షో నిర్వహించడానికి కారణం ఏంటి? తనకు వచ్చిన ప్రజా స్పందనతో ప్రభుత్వానికి హెచ్చరికలు పంపాలని భావించారా? లేక తన బలం ఏంటో తానూ తెలుసుకుందామని భావించారా? ఏది ఏమైనా పవన్ కు అభిమానులు మాత్రం భారీ స్థాయిలో పోటెత్తివచ్చారన్నది మాత్రం నిజం.
తానూ రంగంలోకి దిగితే పరిస్థితి ఇలా ఉంటుందని రాష్ట్ర సర్కార్ కు ఓ చిన్నపాటి హెచ్చరికలు పంపారనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తపరుస్తున్నారు. నేడు వచ్చిన ఈ బలగమంతా రేపు ఓట్ల రూపంలో మారుతుందా? లేదా? అన్న ప్రశ్నను పక్కన పెడితే, అంతర్లీనంగా రాజకీయ వర్గాలు ఓ రకమైన చర్చలకు దారితీసేలా ప్రజావెల్లువ వచ్చిపడింది. భవిష్యత్తులో పవన్ దీనిని ఎలా మలుచుకుంటారో చూడాలి.



