రాష్ట్రంలో ఎన్నికల హడావిడి అప్పుడే మొదలయ్యిపోయింది. రేపే ఎన్నికలు అన్నట్టు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడు హడావిడే. ఎప్పటిలానే పార్టీ నాయకులను, ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడిప్పుడే కొంత బిజీ అవుతున్నారు.
అజ్ఞాతవాసి రిలీజ్ తరువాత పూర్తి స్థాయి రాజకీయాలు చేస్తారేమో. మరో వైపు బీజేపీ టీడీపీతో వెళ్తుందా లేక వైకాపాతో దోస్తీ కడుతుందా అనేది చూడాలి. ప్రత్యేక హోదాని నిరాకరించిన బీజేపీతో జనసేన జతకట్టడం జరగకపోవచ్చు. ప్రత్యేక హోదానే నినాదం అయితే జనసేన పొత్తు కావాలంటే టీడీపీ కూడా అదే పల్లవి ఎత్తుకోవాలి.
కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చారు.లోక్ సభలో తెలంగాణ ఎమ్.పి హైకోర్టు విభజన కోసం ఆందోళన చేసిన సందర్భంగా సుజనా చౌదరి జోక్యం చేసుకుంటూ హైకోర్టు విబజన ఒక్కటే సమస్య కాదని,నియోజకవర్గాల పునర్విభజన, ప్రత్యేక హోదా, తదితర అంశాలు కూడా ఉన్నాయని చెప్పడంతో ఆ దిశగా టీడీపీ ముందుకు పోతుందా అనే అనుమానం కలుగుతుంది.
ఇది జరిగిన వెంటనే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఉలిక్కిపడి తాము బలపడుతున్నాం అనగానే టీడీపీ స్పెషల్ స్టేటస్ వాదన తెస్తుందని ఆరోపించారు కూడా. అయితే ఇప్పటిదాకా సైలెంట్ గా ఉండి ఇప్పుడు మాట్లాడటం టీడీపీకు కూడా అంత తేలిక కాదు. ఇవన్నీ జరగాలంటే అసలు ఆ అంశంపై పవన్ కళ్యాణ్ కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో తెలియాలి.





