వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరియు జనసేన అధినేత పవన కళ్యాణ్ లు ఒకే బాటలో పయనిస్తున్నట్లుగా కనపడుతోంది. మొన్నటివరకు అధికారం వద్దన్న పవన్, ప్రస్తుతం జగన్ మాదిరిగా ‘కాబోయే సిఎం’ తానే (ఒకవేళ మీరు, మీ కుటుంబ సభ్యులు ఓట్లు వేస్తే) అన్నట్లుగా బహిరంగ సభలలో చెప్పుకుంటూ వెళ్తున్నారు. జగన్ అయితే ‘ఓట్లు వేస్తే’ అన్న కండిషన్ చెప్పరు… అంతే తేడా..!
వీరిద్దరి ప్రసంగాలలో ఉన్న సారుప్యతకు నిదర్శనం… ప్రస్తుతం పవన్ చేస్తోన్న 25 కోట్ల కామెంట్స్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 84 కోట్ల రూపాయలను అడ్వాన్స్డ్ టాక్స్ గా చెల్లించి, అప్పట్లో జగన్ మోహన్ హాట్ టాపిక్ అయ్యారు. ఇదే విషయాన్ని వివిధ సందర్భాలలో తన రాజకీయ ప్రచారం కోసం జగన్ వినియోగించుకున్నారు కూడా! ప్రస్తుతం పవన్ కూడా అదే రూట్ లో పయనిస్తున్నారు.
కాకపోతే పవన్ రేంజ్ కు సంఖ్య 25 కోట్లు అయ్యింది. ఈ ఫిగర్ ను పదే పదే చెప్తూ… ఇంత పన్నుగా చెల్లిస్తున్నా తనకు తృప్తి లేదని, తన ఆనందం ప్రజా సేవలోనే ఉందంటూ సినీ డైలాగ్ లతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఆ పన్నులు చెల్లించేది తెలంగాణాలో…? మీరు రాజకీయాలు చేసేదేమో ఆంధ్రాలోనా? మీ వలన ఏపీకి ఒక్క పైసా అయినా పన్ను రూపంలో లబ్ది చేకురుతుందా? అంటూ పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురుస్తోంది. దాదాపుగా జగన్ వ్యాపార లావాదేవీల పరిస్థితి కూడా ఇదే కావడం కాకతాళీయం?!



