జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం భీమవరంలో బహిరంగసభ నిర్వహించారు. తొలిసారిగా సిఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావిస్తూ “జగన్! నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు. అవన్నీ మాట్లాడితే నీ చెవులలో నుంచి రక్తం కారుతుంది జాగ్రత్త!” అంటూ డైరెక్టుగా హెచ్చరించారు.
తన గురించి అవాకులు, చావాకులు మాట్లాడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలను ఉద్దేశ్యించి “మీ అందరి అవినీతి, అక్రమాల భాగోతాల చిట్టాలన్నీ కూడా నా వద్ద ఉన్నాయి. కనుక నన్ను రెచ్చగొట్టి మీ భాగోతాలను బయట పెట్టించుకోవద్దు. ఇకనైనా సిఎం జగన్, మంత్రులు అందరూ నోటికి సైలన్సర్లు బిగించుకొంటే మంచిది. నా మంచితనాన్ని, సంస్కారాన్ని అలుసుగా తీసుకొని నా వ్యక్తిగత విషయాలు మాట్లాడితే ఇకపై సహించను. జాగ్రత్త!” అంటూ పవన్ కళ్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు.
వైసీపీ ఫ్యాక్షనిజాన్ని, రౌడీయిజాన్ని ఏవిదంగా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసన్నారు. వైసీపీ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్తో రాజకీయాలలోకి వస్తే తాను విప్లవ భావాలతో, స్పూర్తితో రాజకీయాలలోకి వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ పాలనలో గంజాయి రాష్ట్ర పంటగా, గొడ్డలి రాష్ట్ర ఆయుధంగా మార్చేశారని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టి, దౌర్జన్యాలు చేస్తున్నారని అయినా నిండా మునిగినవాడికి చలేమిటన్నట్లు మీ దౌర్జన్యాలకు భయపడే వ్యక్తిని కానని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీని ధైర్యంగా ఎదుర్కొని పోరాడి గద్దె దించుతానని పవన్ కళ్యాణ్ శపధం చేశారు.
ప్రజలనుద్దేశ్యించి మాట్లాడుతూ, “మీ అందరికీ 25 ఏళ్ళపాటు కూలీగా పనిచేసేందుకు వచ్చాను. రాష్ట్రాన్ని చక్కదిద్దుకొని మళ్ళీ అభివృద్ధిపదంలో నడిపించుకోవాలనే తపనతోనే జనసేనతో మీ ముందుకు వచ్చానని కనుక ఈసారి తమని ఆశీర్వదించి గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు.
జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సామాన్య ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు మేలు చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అధికారంలో లేనప్పుడే రాష్ట్రంలో రైతులకు, వివిద వర్గాల ప్రజలకు యధాశక్తిన సాయపడుతున్నాని, అధికారం ఇస్తే మరింతగా చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన కార్యకర్తలకే రూ.5 లక్షలకు జీవితభీమా చేయించానని, ప్రభుత్వం తలుచుకొంటే రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షల భీమా చేయించలేదా?అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
మొత్తం మీద ఈసారి పర్యటనలో పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా, మరింత ధైర్యంగా వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి, మంత్రులు ఆయన మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడి రెచ్చగొట్టడం వలననే పవన్ కళ్యాణ్ గీత దాటాల్సి వచ్చిందని భావించవచ్చు.



