పిఠాపురం నుంచే వారాహి యాత్ర….అదే వైసీపీ అంతిమ యాత్రా..?

Pawan Kalyan Varahi Yatra

గడిచిన రెండు నెలల నుంచి పొత్తులు – ఎత్తులు – సీట్ల సర్దుబాట్లతో బిజీబిజీగా గడిపిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక ఎన్నికల శంఖారావం పూరించడానికి రెడీ అయ్యారు. తానూ పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుండే వారాహి తో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు పవన్.

వారాహి మొదటి యాత్రలో భాగంగా వైసీపీ పైన జగన్ పైన పవన్ చేసిన విమర్శల దాడితో అధికార పార్టీ ఒక్కసారిగా ఎగ్రెసివ్ మోడ్ నుంచి ఢిపెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. గతంలో ఆవేశంతో ఊగిపోయే ప్రసంగాలు చేసే పవన్ ఇప్పుడు ఆలోచనతో కూడిన ఆవేశంతో వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు.

ADVERTISEMENT

పవన్ పిఠాపురంలో మొదలు పెట్టే వారాహి యాత్రతో వైసీపీ పార్టీ కి అంతిమ యాత్ర మొదలైనట్టే అంటున్నారు జనసైనికులు. ఇప్పుడు జనసేనకు జనసైనికుల మద్దతుతో పాటుగా టీడీపీ బలం, బీజేపీ ఆశీస్సులు తోడవడంతో వారాహి యాత్ర స్థానిక ప్రజలను మరింత ప్రభావితం చేయనుంది.

వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పవన్ చేసే రాజకీయ ప్రసంగాలు ఆవేశంతో కాకుండా ఆలోచనాత్మకంగా ఉంటే ప్రజలలోకి మరింతగా చేరువవుతాయి. అయితే పవన్ చేసే రాజకీయ ప్రసంగాలలో అనవసరమైన, అసందర్భంగా వ్యాఖ్యలు తరుచు వస్తుంటాయి. పవన్ వాటిని కట్టడి చేసుకుని ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టి ఒక ప్రణాళిక బద్దంగా అలుపెరుగని కృషి చేయగలిగితే ఓటర్లను తమ కూటమి వైపుకి ఆకర్షించుకోగలుగుతారు.

తద్వారా జనసైనికుల ఆశలను, పవన్ ఆశయాన్ని రెండిటిని నెరవేర్చుకున్న వారవుతారు. గత వారాహితో వాలంటీర్ వ్యవస్థను, రాష్ట్రంలో మిస్సింగ్ మహిళల అంశాన్ని, ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా తెలంగాణకు ఎగుమతి అయిన విషయాన్నీ తెరమీదకు తెచ్చి వైసీపీ పార్టీకి చెమటలు పట్టించిన పవన్ ఈసారి వైసీపీ ని ఇరుకున పెట్టడానికి చాల అంశాలే ఎదురుచూస్తున్నాయి.

అమరావతి సచివాలయ తాకట్టు, విశాఖలో పట్టుబడ్డ 25 వేల కేజీల మాదక ద్రవ్యాలు, వాలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని వైసీపీ చేస్తున్న బ్యాక్ డోర్ ప్రలోభాలు, అలాగే జగన్ చెల్లెల్లు షర్మిల, సునీతా వైసీపీ మీద అన్న జగన్ మీద చేస్తున్న ఆరోపణలు, చంద్రబాబు అక్రమ అరెస్టు, రాష్ట్రంలో ఉన్న ఓట్లను తొలగిస్తూ…కొత్త ఓటర్లను సృష్టించిన దృశ్యాలు, అలాగే పోలవరం, రాజధాని, మద్యం పాలసీ…ఇలా చెప్పుకుంటూ పొతే చాల అంశాలే ప్రతిపక్షాలకు ఆహారంగా మిగిల్చింది వైసీపీ ప్రభుత్వం.

వీటన్నింటిని బాబు, పవన్, లోకేష్ జాగ్రత్త గా ఒడిసిపట్టుకుని ప్రజలలోకి బలంగా తీసుకెళ్లగలిగితే కూటమి విజయం అనివార్యమవుతుంది. ఇలా ముగ్గురు అగ్ర నేతలు వారి వారి ప్రచారాలతో ప్రజలను ప్రభావితం చేయగలిగితే వైసీపీ కి ఇవే చివరి ఎన్నికలు అయిన ఆశ్చర్యంలేదు. అధికారం చేజిక్కగానే నియంతలుగా మారిపోయిన ముఖ్యమంత్రులు, ఆ పార్టీలు ఒక్కసారి అధికారం చేజారగానే సొంత కుటుంబ సభ్యులను కూడా కాపాడుకోలేని పరిస్థితికి దిగజారిపోతారనేది కేసీఆర్ విషయంలో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది.

ఇన్నాళ్ళుగా అధికారం అనే కవచాన్ని అడ్డుపెట్టుకుని మంత్రులుగా, నాయకులుగా, వారి అధినేతగా ఉన్న వారు సైతం ప్రతిపక్ష నేతలను కించపరుస్తూ వారి కుటుంబాలను అవమానిస్తూ రాజకీయ విమర్శల హద్దులు చెరిపేసి చేసిన అరచానికి ఇక అంతిమ గడియలు మొదలయ్యాయి అనే ఆశతో టీడీపీ – జనసేన కార్యకర్తలు ఉత్సహంగా ఎన్నికల ప్రచారానికి వస్తున్న వారి అధినేతలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories