పవన్ కళ్యాణ్ శనివారం పార్టీ అధికార ప్రతినిధులతో మంగళగిరి కార్యాలయంలో సమావేశమై దిశానిర్దేశం చేశారు. అందరూ హుందాగా, రాజ్యాంగానికి లోబడి పద్దతిగా మసులుకోవాలనేది దాని సారాంశం. రాజకీయ పార్టీలన్నీ ఇలాగే వ్యవహరిస్తుంటే స్కూల్స్, కాలేజీలలో పాఠ్యపుస్తకాలలో చెప్పుకొన్నట్లు రాజకీయాలు చాలా అద్భుతంగా ఉండేవి. నేడు రాష్ట్రాలు, దేశం మరో స్థాయిలో ఉండేది కదా?
దశాబ్ధాలపాటు రాజకీయాలలో పనిచేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం ఇప్పటి రాజకీయాలను చూస్తే అసహ్యం వేస్తోందని అనేశారు. అన్ని పార్టీలు పోటీ పడి ఒక్కో మెట్టు దిగుతున్నప్పుడు రాజకీయాలు మురికి గుంటలాగే మారిపోతాయి. ఆ మురికిని భరించలేమనుకొన్న జయప్రకాష్ నారాయణ వంటివారు దణ్ణం పెట్టేసి పార్టీలను మూసుకొని పోతారు. ఇంకా ఆశ ఉన్నవాళ్ళు ప్రొఫెసర్ కోదండరామ్లాగ మార్పు కోసం ప్రయత్నిస్తుంటారు.
కానీ పదేళ్లుగా రాజకీయాలలో నలుగుతూ, వైసీపి తీరుని కళ్ళారా చూసి అనుభవిస్తున్న పవన్ కళ్యాణ్ “ఎవరెలా ప్రవర్తించినా మనం పద్దతిగానే ముందుకు సాగుదాం,” అని చెప్పడం ఆయన నిజాయితీకి, నిబద్దతకు నిదర్శనం కావచ్చు. కానీ ఇటువంటి సమయంలో జనసేన గిరిగీసుకొని కూర్చోవాలనుకొంటే అది రాజకీయ ఆత్మహత్యతో సమానమని చెప్పవచ్చు.
అంటే వైసీపిలాగ కుట్రలు, కుతంత్రాలు చేయమని కాదు… మీడియా ముందుకు వచ్చి బూతులు మాట్లాడమని కాదు. కానీ వైసీపి కుట్రలను, కుతంత్రాలను ధీటుగా ఎదుర్కోవవలసి ఉంది. కాదని “మేము గిరిగీసుకొని కూర్చొని నీతినిజాయితీగానే ముందుకు సాగుతాము,” అని అనుకొంటే వైసీపికి అదే చాలు.
మరోవిదంగా చెప్పాలంటే జనసేన పద్దతిగా ముందుకు సాగాలనుకొంటే ఎన్నికలకు ముందు అస్త్రసన్యాసం చేసి వైసీపి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు మార్గం సుగమం చేసిన్నట్లే.




