ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో స్పీడ్ పెంచారు. సంక్షేమ పథకాలల్లో దూకుడు పెంచుతున్నారు. పెన్షన్ను రెట్టింపు చేశారు. మహిళలకు పదివేల రూపాయలిస్తున్నారు. రైతులకు నగదు బదిలీ చేస్తున్నారు. ఇలా సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతను సానుకూల ఓటుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు స్పీడ్ ప్రాతిపక్షాలకు మింగుడు పడటం లేదు. దీనితో చంద్రబాబును ఓడించడానికి అన్ని శక్తులు ఏకమవుతున్నాయన్న సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి , జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఢిల్లీ వర్గాలు ప్రచారం జరుగుతుంది. వీరిద్దరూ కలిసి ఎన్నికలకు వెళ్తే చంద్రబాబుని ఓడించడం తేలికని కమలనాధుల అభిప్రాయం. 2014లో పవన్, చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మద్దతుతోనే చంద్రబాబు 2014 ఎన్నికలలో స్వల్ప తేడాతో గెలిచారని, ఇప్పుడు ఆ ఓట్లు పోయి, ప్రభుత్వ వ్యతిరేకత వల్ల మరిన్ని ఓట్లు పోతే టీడీపీని 25 సీట్లకే పరిమితం చెయ్యొచ్చని కమలనాధుల వ్యూహం.
కేసులను ఉపయోగించి జగన్ ను జైలుకు పంపి, పవన్ కళ్యాణ్ అనుభవరాహిత్యాన్ని వాడుకుంటే 2024 నాటికి బీజేపీని రాష్ట్రంలో బలీయమైన శక్తిగా చెయ్యవచ్చని వారి అంచనా. అయితే ఇప్పటికే ఒకరినొకరు తిట్టుకున్న జగన్ పవన్ పొత్తుకు అంత సానుకూలంగా లేరు. 2014లో వామపక్షాలకు 6-7 సీట్లు ఇవ్వడానికి కూడా జగన్ కు మనస్కరించలేదు. ఫలితాలొచ్చిన తర్వాత చంద్రబాబు రెండు శాతం మాత్రం ఓట్లతోనే గెలిచారని పదేపదే చెప్పుకుని బాధపడ్డారు. కానీ ఆ రెండు శాతం ఓట్లు కమ్యూనిస్టుల పొత్తు పెట్టుకుంటే వచ్చేవనే విషయాన్ని మాత్రం గుర్తించడానికి సిద్ధపడలేదు.
దీనితో పొత్తుల విషయంలో జగన్ కు పెద్దగా క్లారిటీ లేదని అర్ధం అవుతుంది. అది అతివిశ్వాసం అని 2014లో తేలినా ఆయన మారడం లేదు. పవన్పై వ్యక్తిగత విమర్శలు చేసి దూరం చేసుకుంటున్నారు. మరోవైపు జనసేనకూడా 20-30 సీట్లతో సరిపెట్టుకునే ఉద్దేశం లేదు. పొత్తు అంటే కనీసం సగం సీట్లు పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆ పార్టీ పరిస్థితికి వారు అడుగుతున్న సీట్లకు పొంతన లేదు. దీనితో వీరిని కలపడానికి కమలనాధులు, తెరాస నాయకులు తలలు పట్టుకుంటున్నారు.



