దేశానికి ముప్పు తలపెడితే ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే ఉండదని గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పుతో మరోసారి స్పష్టం చేసింది.
2008లో దేశవ్యాప్తంగా భయాందోళనలు సృష్టించిన అహ్మదాబాద్ వరుస పేలుళ్ళ కేసు విచారణ జరిపిన ప్రత్యేక న్యాయస్థానం 38 మంది దోషులకు ఉరిశిక్ష వేసింది. మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 2022లో తీర్పు చెప్పింది.
దాని తీర్పుపై వారు హైకోర్టును ఆశ్రయించగా మరో నాలుగేళ్ళపాటు లోతుగా విచారణ జరిపి నేడు ఈ సంచలన తీర్పు వెలువరించింది.
ఇంత హేయమైన నేరానికి పాల్పడినప్పటికీ 18 ఏళ్ళపాటు శిక్ష పడకుండా తప్పించుకోగలుగుతున్నారంటే, అది మన న్యాయవ్యవస్థ న్యాయానికి ఇస్తున్న అవకాశమా? లేక న్యాయవ్యవస్థ బలహీనతా? అనే ప్రశ్నకు ఎవరికీ వారు సమాధానం చెప్పుకోవాల్సిందే!
మన న్యాయవ్యవస్థ బలం లేదా బలహీనతపై సామాన్య ప్రజల కంటే ఇలాంటి కరడుగట్టిన ఉగ్రవాదులకే ఎక్కువ నమ్మకముంది. ఆ నమ్మకంతోనే వారు అన్ని న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకుంటూ ఇంతకాలం శిక్ష అమలుకు దూరంగా ఉండగలిగారు.
2008లో వారు ఈ పేలుళ్ళు జరిపి 56 మంది అమాయక ప్రజల ప్రాణాలు హరిస్తే, వారికి మరణశిక్ష ఖరారు చేయడానికి 18 ఏళ్ళు పట్టింది.
అయితే వారు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకుంటారు. కనుక వారికి ఇప్పటికిప్పుడు మరణశిక్ష అమలయ్యే అవకాశం లేదనే భావించవచ్చు. ఈ ప్రక్రియ ముగియడానికి మరికొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు.
కోర్టు తీర్పు వెలువడడానికి 18 ఏళ్ళు పట్టి ఉండవచ్చు. కానీ ఈ తీర్పుతో దేశానికి ముప్పు తలపెట్టాలనుకుంటున్న ఉగ్రవాదులకు సైతం బలమైన సందేశం ఇచ్చినట్లే భావించవచ్చు.
అయితే ఇదే తీర్పు ఒకటి, రెండు సంవత్సరాలలోనే వచ్చి ఉండి ఉంటే ఉగ్రవాదులకు మారిత బలమైన సందేశం ఇచ్చినట్లు ఉండేది కదా? ఎందువల్లనంటే ఇటువంటి నేరం చేస్తే ఉరిశిక్ష పడుతుందనే భయం కంటే వెంటనే శిక్ష పడుతుందనే భయం ఉగ్రవాదులను ఒకటికి పదిసార్లు ఆలోచించుకునేలా చేస్తుంది కదా?




