ప్రస్తుతం భారత్ మరియు శ్రీలంక వేదికగా జరుగుతున్న టి-20 వరల్డ్ కప్ టోర్నీ నుండి పాకిస్తాన్ జట్టు నిష్క్రమించబడిన విషయం అందరికి తెలిసిందే. అయితే, ఇప్పటికే సెమీస్ ను చేరలేదని బాధలో ఉన్న ఆ జట్టు ఆటగాళ్లకు సొంత బోర్డు మరొక షాక్ ఇచ్చింది.
ఈ వరల్డ్ కప్ గ్రూప్-స్టేజి లో భారత్ పై ఘోరంగా ఓటమి పాలయినందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లపై ఫైన్ వేసినట్లు తెలుస్తుంది. కానీ, ఒకవేళ పాక్ సెమీస్ ను చేరితే ఈ ఫైన్ ను ఎత్తివేస్తామన్న బోర్డు, నేడు పాక్ సెమిస్ ను చేరనందున తమ ఆటగాళ్ల పై ఫైన్ ను కొనసాగిస్తుంది.
తమ ఆటగాళ్లు ఉత్తమమైన ఆటతీరు కనబరిచినపుడు అవార్డులు, రివార్డులు అందుకుంటున్నవారు, అనుకున్న స్థాయిలో రాణించనపుడు ఇలా ఫైన్లను కూడా భరించాల్సిందే అంటూ తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.
వారి బోర్డు చెప్పినట్లు గానే ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు వరల్డ్ క్రికెట్ లో ఒక పసి కూన లాగా తయారయింది. 2022 టి-20 వరల్డ్ కప్ లో ఫైనల్ కు చేరిన ఆ జట్టు, ఆ తరువాత ఆడిన 4 టోర్నీలలో కనీసం సెమి-ఫైనల్ ను కూడా చేరలేక ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 3 సార్లు గ్రూప్ స్టేజి నుండే నిష్క్రమించబడింది.
2023 వన్-డే వరల్డ్ కప్ లో గ్రూప్ స్టేజ్ లోనే ఇంటి దారి పట్టిన పాక్, 2024 టి-20 వరల్డ్ కప్ లో అమెరికా జట్టుతో సూపర్-ఓవర్ లో మ్యాచ్ కోల్పోయి కనీసం సూపర్-8 కు అర్హత సాధించకుండానే వెనుదిరిగారు. 2025 లో కోరి మరీ సొంత గ్రౌండ్లలో ఛాంపియన్స్ ట్రోఫీ జరిపించుకున్న వేళ, అది మరొక గ్రూప్ స్టేజి నిష్క్రమణకు మాత్రమే దారి తీసింది.
ఇలా ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉందనేది వాస్తవమే కానీ, ఇలా సొంత బోర్డు చేతిలోనే ఫైన్ల పాలయ్యి వార్తలలో నిలుస్తుండడం విన్న క్రికెట్ ప్రపంచం నవ్వుకుంటుంది. పాక్ బోర్డు ఇలా చేయటం ఇది కొత్తేమి కాదు, గతేడాది ఆసియ కప్ ఫైనల్ లో ఓటమి తరువాత కూడా ఆటగాళ్లకు కొన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ అది ఎక్కువ రోజులు అమలులో లేదు.
తమ పేలవమైన ఫామ్ కారణంగా ప్రతి ప్లేయర్ కు పాక్ కరెన్సీలో 50 లక్షల నగదు ఫైన్లు వేశారని తెలుస్తుంది. ఈ ఫైన్ ప్రస్తుత కొత్త ప్లేయర్స్ పాలిట శాపం అని చెప్పవచ్చు. ఈ టోర్నీ మొత్తంలో పాక్ జట్టులో బాగా పెర్ఫర్మ్ చేసిన ఫర్హాన్ కూడా ఈ ఫైన్ కట్టకతప్పదని తెలుస్తోంది. చూడాలి మరి, పాక్ బోర్డు మరోసారి తమ ఆంక్షలను వెనక్కి తీసుకుంటుందో లేదో అని..?







