తెలంగాణాలో తెలుగు దేశం పార్టీ గెలిచిన రెండు సీట్లలో ఒకటైన సత్తుపల్లిలో కొత్త వివాదం మొదలయ్యింది. సత్తుపల్లిలో ఓటమిపాలైన తెరాస నేత పిడమర్తి రవి అభ్యంతరంగా వ్యవహరిస్తున్నారు. తాను ఓడినా, ఇక్కడ తనే ఎమ్మెల్యేగా పనిచేస్తానని, తాను చెబితేనే పనులు అవుతాయని ఆయన అంటున్నారు. ఎవరైనా ఇక్కడ పనులు జరగాలంటే తన వద్దకు రావల్సిందేనని, ప్రజల పనులు తానే చేస్తానని ఆయన పబ్లిక్ గానే చెప్పుకొచ్చారు. టీడీపీ అభ్యర్ధి సండ్ర వెంకట వీరయ్య ఇక్కడ గెలుపొందారు.
[m9ad]
తెలంగాణలో తెలుగుదేశం తరపున అత్యధిక మెజారిటీ తో గెలిచిన నేత వీరయ్య. ఆయన ఇక్కడ నుండి వరుసగా మూడో సారి గెలిచారు. ఈ ఒక్క ఉదంతం తెలంగాణాలో ప్రతిపక్షాల పరిస్థితి ఏంటో అర్ధం పడుతుంది. బహుశా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను డమ్మీలుగా చేసి ప్రతిపక్షాలకు ఓట్లు వేస్తే తమకు భవిష్యత్తు లేదు అని ఆయా నియోజకవర్గాల ప్రజలు అనుకునే చేస్తారన్నమాట. అదే క్రమంలో నిధులు ఇవ్వకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అధికార పక్షం వైపు తిప్పుకునేలా చేసే వ్యూహం ఇదొక రకమైన ఆపరేషన్ ఆకర్ష అనుకోవచ్చు.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి మంచి పద్దతి అనిపించుకోదు. గత టర్మ్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా నియోజకవర్గ నిధులు ఇచ్చారు. అయితే ఇప్పుడు భారీ విజయం వల్ల వచ్చిన గర్వం కావొచ్చు ఇంకోటి కావచ్చు. ఫెడరల్ స్ఫూర్తి, రాష్ట్రాల మధ్య ఐక్యత అంటూ పెద్ద పెద్ద వ్యూహాలతో జాతీయ రాజకీయాల వైపు సాగుతున్న కేసీఆర్ ఇటువంటి వాటిని ఉపేక్షిస్తే చిన్నతనం అనిపించుకుంటారు. అది ఆయనకు మంచిది కాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదు.



