గమనిక: మేము పారిపోవడం లేదు

జూన్ 4వ తేదీన ఏపీ ఎన్నికల ఫలితాలను చూసి యావత్ దేశం ఆశ్చర్యపోతుందని జగన్‌ ఏ ఉద్దేశ్యంతో అన్నారో కానీ టిడిపి నేతలు కూడా ‘అవును నిజమే’ అని మొహమాట పడకుండా ఒప్పేసుకున్నారు.

తాజా సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ప్రమాణస్వీకారం, మంత్రి పదవుల గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

ఇదే సమయంలో సిఎం జగన్మోహన్‌ రెడ్డి భార్య భారతితో కలిసి శుక్రవారం రాత్రి విదేశాలకు వెళ్ళిపోయారు. మళ్ళీ నెలాఖరున వస్తారని వైసీపి నేతలు చెప్పుతున్నారు.

విజయసాయి రెడ్డి, కొడాలి నాని తదితరులు పోలింగ్‌ మర్నాటి నుంచి ఎవరికీ కనిపించడం లేదు. వైసీపి సోషల్ మీడియా ఆఫీసులో పనిచేస్తున్న వారందరికీ సెలవులు అంటూ పంపించేసి మూసేశారు. దానిని నడిపిస్తున్న సజ్జల కుమారుడు భార్గవ రెడ్డి హైదరాబాద్‌ వెళ్ళిపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

పల్నాడు జిల్లా మాచర్లలో అల్లర్లు, దాడులు, పోలింగ్‌ కేంద్రంలో ప్రవేశించి ఈవీఎం ధ్వంసం చేయడానికి ప్రయత్నించడంతో పోలీసులు వైసీపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఇద్దరినీ గృహ నిర్బంధంలో ఉంచగా వారి కళ్ళు గప్పి ఇద్దరూ హైదరాబాద్‌ వెళ్ళిపోయిన్నట్లు తెలిసింది.

పల్నాడులో జరిగిన అల్లర్లు, దాడులు, విధ్వంసానికి జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను బాధ్యులను చేస్తూ ఈసీ ఇప్పటికే వారిరువురిపై వేటు వేసింది. రెండు రోజులలో ఈ విధ్వంసానికి పాల్పడిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్ జవహార్ రెడ్డిని ఈసీ ఆదేశించింది.

కనుక ఏ క్షణంలోనైనా పోలీసులు తమని అరెస్ట్ చేయవచ్చనే భయంతో పిన్నెల్లి సోదరులు హైదరాబాద్‌ పారిపోయారు. దారిలో సాగర్ చెక్ పోస్ట్ వద్ద తమ గన్‌మ్యాన్‌లను వెనక్కు తిప్పి పంపేశారు.

తాము పరారయ్యమనే మీడియాలో వార్తలు చూసి వైసీపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మేము మా సొంత పనుల మీద హైదరాబాద్‌ వచ్చాము తప్ప ఎక్కడికి పారిపోలేదు. ఇక్కడ పనులు చక్కబెట్టుకున్నాక ఏపీకి తిరిగివస్తాము,” అని చెప్పారు.

పలువురు వైసీపి నేతలు, ముఖ్యంగా ఇంతకాలం టిడిపి, జనసేనలను వేధించిన వైసీపి నేతలుమూటా ముల్లె సర్ధుకుంటున్నారు.

వైసీపి పరిస్థితి ఇలా ఉంటే, మరోపక్క ఈసీ ఇంకా కొరడా ఝలిపిస్తూనే ఉంది. ఇంతకాలం జగన్‌ ప్రభుత్వం ఉపయోగించిన ‘ఈ-ఆఫీస్’ సాఫ్ట్‌వేర్‌లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయరాదని, అది దానిలో ఉన్న ఫైల్స్, కీలక డాక్యుమెంట్ల సాఫ్ట్‌ కాపీలు అన్నీ యధాతధ స్థితిలో ఉంచాలని సిఎస్ జవహార్ రెడ్డిని ఆదేశించింది.

ఈ నెల 17 నుంచి 27వరకు దాని వాడకం నిలిపివేసి, అప్‌గ్రేడ్ చేస్తుండటంపై చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేస్తూ గవర్నర్‌కి, ఈసీకి లేఖలు వ్రాయగా ఈసీ వెంటనే స్పందించింది.

ADVERTISEMENT
Latest Stories