రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడితే అది తర్వాత అధికారంలోకి వచ్చే ప్రత్యర్ధులకు అవకాశంగా మారుతుంటుంది. అప్పుడు కేసులు, విచారణ, జైలు, బెయిల్ స్టోరీలు మొదలవుతాయి.
వాటినీ అనుకూలంగా మార్చుకోవడానికి రాజకీయ పార్టీలు మరో ఫార్ములా కనిపెట్టాయి. కేసులు నమోదు చేయగానే అది రాజకీయ కక్ష సాధింపే అని తీర్మానించేసి గట్టిగ వాదించడం మొదలు పెడతాయి. కానీ అవినీతికి పాల్పడ్డారని అధికార పార్టీ నేతలు వాదిస్తుంటారు. కనుక ఎవరు అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్నా ఇవే వాదనలు వినిపిస్తుంటాయి.
కనుక 1. అధికారంలో ఉన్నవారు ఎవరూ ఎన్నడూ అవినీతికి, అక్రమాలకూ పాల్పడరని ప్రజలు కూడా నమ్మాల్సి ఉంటుంది. 2. ఆ కేసులకు ‘రాజకీయ కక్ష సాధింపు ట్యాగ్’ తగిలిస్తారు కనుక ఒకవేళ ఎవరైనా అవినీతికి పాల్పడినా వారిని దోషులుగా పరిగణించరాదు.
కానీ అవినీతికి పాల్పడినందుకు లేదా రాజకీయ కక్షతో కావచ్చు కేసులు, విచారణ, జైలు, బెయిలు వంటివి తప్పవు. వీటితో ‘బాధిత నాయకులకు’ మంచి రాజకీయ మైలేజ్, ప్రజల సానుభూతి లభిస్తుంది. కానీ వీటి వల్లనే వారి ప్రతిష్ట మసక బారుతుంది. ప్రజలలో వ్యతిరేకత ఏర్పడి పెరుగుతుంది.
కనుక దీనికీ వారు కొన్ని పరిష్కారాలు కనుగొన్నారు. 1. సత్య ప్రమాణాలు, 2. లై డిటెక్టర్ టెస్ట్, 3. మీడియా సమక్షంలో బహిరంగ చర్చ, 4. రాజకీయ సన్యాసం, 5. తల నరుక్కోవడం. అయితే వీటిలో సత్య ప్రమాణాలు మాత్రమే తేలిక కనుక కొందరు చేస్తుంటారు. మిగిలినవి ఊహాజనితమైన సవాళ్ళే కనుక అవి ప్రగల్భాలకే పరిమితం.
ఎఫ్-1 రేసింగ్ కేసులో కేటీఆర్, వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి, కల్తీ నెయ్యి వ్యవవహారంలో వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, పరకామణి కేసులో భూమన కరుణాకర్ రెడ్డి, మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి, సజ్జల, రేషన్ బియ్యం కేసులో పేర్ని నాని ఇలా.. అనేక మంది అనేక కేసులలో పైన పేర్కొన్న వాటి ప్రకారం అవినీతి నిరూపణకు సిద్దమయ్యారు.
అవినీతి కేసులు విచారణకి ఇన్ని సులువైన మార్గాలు ఉండగా పోలీసులు, న్యాయస్థానాలు మాత్రం చట్టం, రాజ్యాంగం అంటూ ఇంకా పాత పద్దతులలోనే విచారణ జరుపుతున్నాయని స్పష్టం అవుతోంది. అందువల్లే అవినీతి కేసులు తెలుగు టీవీ సీరియల్స్లా ఒకటి రెండు తరాలవారు చూసేలా ఏళ్ళ తరబడి సాగిపోతున్నాయి.
కనుక కేసీఆర్ చెప్పిన్నట్లు ఎప్పుడైనా రాజ్యాంగం తిరగ వ్రాసుకున్నప్పుడు, అధికారంలో ఉన్నవారు అవినీతికి పాల్పడినా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడకూడదని, అవినీతి కేసుల విచారణలో ఈ 5 పద్దతులను విధిగా పాటించాలని ‘పెద్ద పెద్ద అక్షరాలతో తప్పక వ్రాయాలి. దాంతో అవినీతి అంతం అయిపోతుంది. సో సింపుల్!




