ఆంధ్రప్రదేశ్ లో వెలిగిపోదామని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వ్యూహరచన గావిస్తున్న విషయం రాజకీయ విజ్ఞులకు తెలిసిన విషయమే. ఆ దిశగా పావులు కదుపుతున్న బిజెపి, నేడు రాజమహేంద్రవరంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకుంది. పార్టీ తరపున అమిత్ షా వంటి హేమాహేమీలు హాజరు కాబోతున్న నేపధ్యంలో ప్రజలు కూడా భారీగా తరలి వస్తారని ఆశించిన పార్టీ వర్గీయులకు ఏపీ ప్రజలు షాక్ ఇచ్చారు.
సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభం అవుతుందని ముందుగానే ప్రచారం చేసింది బిజెపి. అయితే మూడు గంటల ప్రాంతంలో ఒక మీడియా ఛానల్ ఇచ్చిన లైవ్ కవరేజ్ లో సభా ప్రాంగణంలో కనీసం ఒక్కరు లేకపోవడం వీక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. పత్రికా విలేఖరులు తప్ప సామాన్య ప్రజలు లేక సభా వేదిక వెలవెలబోతూ దర్శనమిచ్చింది.
దీంతో పరిస్థితిని గమనించిన పార్టీ నేతలు ప్రస్తుతం జనాలను తరలించే కార్యక్రమంలో నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు పార్టీ కార్యకర్తలు, నేతల అనుచరులు చేరుకున్నా ప్రజలు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదని స్పష్టమైంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పరిస్థితి ఏమిటో బిజెపి అధిష్టానానికి కళ్ళకు కట్టినట్లు తెలిసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.



