గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని లోపల వేసేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయా?అంటే అవుననే అంటున్నారు టిడిపి నేతలు. శాసనసభలో చంద్రబాబు నాయుడుని దారుణంగా అవమానించడం, మీడియా ముందు కూడా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లను ఉద్దేశ్యించి చాలా అసభ్యంగా మాట్లాడటం, గుడివాడలో టిడిపి కార్యాలయంపై దాడి వంటి పెద్ద జాబితాయే ఉంది.
కొడాలి నానిని గుడివాడ పట్టణంలోనే డ్రాయర్తో ఊరేగిస్తానని నారా లోకేష్ ఇదివరకు హెచ్చరించారు కూడా. కనుక టిడిపి నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులే కాదు… యావత్ రాష్ట్ర ప్రజలు కూడా కొడాలి నానికి టిడిపి కూటమి ప్రభుత్వం ఎప్పుడు, ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తుందా?అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
చంద్రబాబు నాయుడు ఏది చేసినా శాస్త్రోక్తంగా అంటే చట్ట ప్రకారమే చేయాలనుకుంటారు. కనుక ముందుగా గుడివాడలో టిడిపి కార్యాలయం విధ్వంసం కేసుతో కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు చేయబోతున్నట్లు తాజా సమాచారం.
ఇప్పటికే ఆయన ఆప్త మిత్రుడు వల్లభనేని వంశీ అండ్ కోపై ఇటువంటి కేసు నమోదు చేసి ఆయన అనుచరులను లోపల వేశారు. కనుక తర్వాత కొడాలి నాని వంతే అంటున్నారు టిడిపి నేతలు, కార్యకర్తలు.
దీంతో బాటు గుడివాడ క్యాసినో వ్యవహారంపై కూడా మరో కేసు నమోదు చేసి విచారణ చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.
టిడిపి కార్యాలయంపై దాడి కేసులో కొడాలి నానికి మానసిక, శారీరిక బాధలు భరించాల్సి రావచ్చు. కానీ క్యాసినోలో వందల కోట్లు చేతులు మారాయి కనుక ఇది ఇంకా పెద్ద కేసు అవుతుంది. బహుశః ఈడీకి అప్పగిస్తే ఇంకా పెద్ద కేసు అయిపోతుంది. ఈడీ విచారణ మొదలుపెడితే చాలా మంది నేతల పేర్లు బయటకు రావచ్చు.
కనుక ఈ కేసు నమోదు చేసి విచారణ మొదలుపెడితే కొడాలి నాని పరిస్థితి ఏవిదంగా మారుతుందో ఎవరూ ఊహించలేరు.
ఏది ఏమైనప్పటికీ కొడాలి నానిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తే టిడిపి శ్రేణులకు చాలా సంతోషం కలుగవచ్చు. కానీ అవినాష్ రెడ్డినే వెనకేసుకువచ్చిన జగన్, తన కోసం చంద్రబాబు, పవన్, లోకేష్లను బూతులు తిట్టి అవమానించిన కొడాలి నానికి అండగా నిలబడతారు. కనుక కొడలిని అరెస్ట్ చేయడం అంటే జగన్తో యుద్ధానికి సిద్దం కావలసిందే.




