ఐఏఎస్, ఐపీస్ అధికారులు తమ పరిధి మేరకే విధులు నిర్వర్తించాలి తప్ప అధికారంలో ఉన్నవారికి తొత్తులుగా మారకూడదు. మారితే ఏమవుతుందో ఐఏఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు తాజా అరెస్టుతో మరోసారి రుజువైంది.
ఓ వైసీపీ నేతని ఓ కేసులో నుంచి బయట పడేసేందుకు బాలీవుడ్ నటి కాదంబరిపై అక్రమ కేసు నమోదు చేయించి ఈ కేసు పేరుతో ఆమెని, ఆమె తల్లిని నిర్బంధించి వేధించినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఆయనకి మే 7 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించడంతో విజయవాడ సబ్ జైలుకి తరలించారు.
ఓ సీనియర్ ఐపీస్ అధికారిగా విధులు నిర్వర్తించాల్సిన పిఎస్ఆర్ ఆంజనేయులు, జగన్ కోటరీలో ఓ కీలకమైన వైసీపీ నాయకుడులా వ్యవహరిస్తుండటంతో ఎన్నికల సమయంలో ఈసీ ఆయనని ఆ పదవి నుంచి తప్పించింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత (సెప్టెంబర్లో) ఆయన ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు గౌరవంగా పదవీ విరమణ చేయాల్సిన సమయంలో జైలు పాలయ్యారు.
ఐఏఎస్, ఐపీస్ అవ్వాలంటే ఎంతో కష్టపడి చదవాలి. అద్భుతమైన తెలివితేటలు, అంతకు మించి కృషి, పట్టుదల ఉంటేనే ఈ స్థాయికి ఎదగగలరు. కానీ అంతగా శ్రమించి ఆ స్థాయికి ఎదిగిన తర్వాత అదంతా మరిచిపోయి రాజకీయాలలో పడి అధికారపార్టీకి తొత్తులుగా మారినందుకు ఈవిదంగా జైలు పాలయ్యారు.
ఆ స్థాయికి ఎదిగినవారికి సమాజంలో చాలా గౌరవ మర్యాదలు లాభిస్తాయని అందరికీ తెలుసు. కనుక ఎంతో గౌరవంగా పదవీ విరమణ చేయాల్సిన తరుణంలో ఇటువంటి ముగింపు, ఈ కష్టాలు, అవమానాలు అన్నీ ఆయన కోరి తెచ్చుకున్నావే కదా?
జగన్ కోసం పిఎస్ఆర్ ఆంజనేయులు చేయకూడని తప్పులన్నీ చేసి జైలు పాలైతే జగన్ ఏం చేశారంటే ఆయన అరెస్టుని ఖండించి సింపుల్గా చేతులు దులుపుకున్నారు. పైగా కేసులకు, అరెస్టులకు ఎవరూ భయపడవద్దని ఉచిత సలహా ఇచ్చారు.
తాను జైలుకి వెళ్ళి వచ్చానని పదేపదే నిసిగ్గుగా చెప్పుకోవడమే కాక జైలుకి వెళ్ళి వచ్చినా ఏమీ కాదని చెప్పడం సిగ్గుచేటు. జగన్కి జైలుకి వెళ్ళడం సిగ్గు, అవమానంగా అనిపించకపోయి ఉండొచ్చు. కానీ ఐఏఎస్, ఐపీస్ అధికారులకు అవమానకరమే కదా?
తమకు ఈ దుర్గతి పట్టించినందుకు వారు జగన్ని బహిరంగంగా నిందించలేకపోవచ్చు కానీ జైలు గదిలో ఇతర నేరస్థులతో కలిసి గడపవలసి వచ్చినప్పుడు కుమిలిపోకుండా ఉంటారా?
కనుక రాజకీయ నాయకులు ఆడే రాజకీయ క్రీడలలో తాము కూడా పాల్గొనాలని ఐఏఎస్, ఐపీస్ అధికారులు ఆరాట పడకుండా వాటికి దూరంగా ఉండటం చాలా మంచిదని పిఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్తో మరోసారి స్పష్టమవుతోంది.




