నెల్లూరు ప్రాంతంలో వరుసగా హత్యలు చేస్తూ పట్టుబడిన సైకో కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ పోలీసుల విచారణలో విస్మయం కలిగించే వాస్తవాలు వెల్లడించాడు. తాను రాంగోపాల్ వర్మ తీసే సినిమాలు చూసి ప్రేరేపితుడనై హత్యలు చేస్తున్నట్టు చెప్పాడు. ఆధార్ అనుసంధానం, సెట్ టాప్ బాక్సుల మరమ్మతుల పేరుతో ఇళ్లలోకి వెళ్లి, మహిళలను, వృద్ధులను సుత్తితో మోది హత్యలు చేసి పారిపోతుంటాడు వెంకీ.
ఇటీవల ఓ పూజారి దంపతులను హత్య చేశాడు. శనివారం నాడు మిట్టమధ్యాహ్నం నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో మరో మహిళను దారుణంగా హతమార్చి, ఇంకో ఇద్దరిపై హత్యాయత్నం చేయగా, స్థానికులు అడ్డుకుని పోలీసులకు పట్టించారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఎర్రబొట్లపల్లికి చెందిన ఈ నిందితుడు, వర్మ సినిమాలను లెక్కలేనన్ని సార్లు చూస్తుంటాడని, ఆయా చిత్రాల్లోని ఘటనలను గుర్తు చేసుకుంటూ హత్యలు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
ఇప్పటివరకూ నలుగురిని హత్య చేశాడని, ఇంకెవరిపైనైనా దాడులు చేశాడా? అన్న విషయాన్ని విచారిస్తున్నామని వివరించారు. దీంతో వర్మ సినిమాలను ఈ రకంగా కూడా వినియోగించుకుంటున్నారా అన్న రీతిలో చలోక్తులు వినపడుతున్నాయి. తానూ చేసే సైకో పనులకు సినిమాలను అడ్డం పెట్టుకోవడం అనేది అతడి మానసిక పరిస్థితిని చాటిచెప్తోందని మానసిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.



