ఆ రెండూ ప్రధాని మోడీకే సొంతం… కాదనగలరా?

Narendra Modi leadership

భారత రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ఎవరంటే చాలామంది ప్రధాని మోడీ పేరే చెబుతారు. అదే సమయంలో అత్యధిక వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కొంటున్న నాయకుడు కూడా ఆయనే.

ఇలాంటి రాజకీయ నాయకులు దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా మందే ఉన్నారు. కానీ యావత్ దేశాన్ని నడిపిస్తున్నది ప్రధాని మోడీ… కనుక ఆయన ఈ రెండు విధాలుగా బాగా హైలైట్ అవుతుంటారు.

ADVERTISEMENT

కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలతో పాటు వివిధ వర్గాలు, మతాలు, ప్రాంతాలకు చెందిన అనేక మంది ఆయన ఆలోచనలను, నిర్ణయాలను, ప్రభుత్వ విధానాలను, రాజకీయాలు చేసే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. కనుక వ్యతిరేకతకి వందలు వేల కారణాలు ఉండవచ్చు.

అయితే మరోవైపు ప్రధాని మోడీని అత్యంత శక్తివంతమైన, దూరదృష్టి కలిగిన నాయకుడిగా భావించేవారు కోట్లమంది ఉన్నారు. ముఖ్యంగా జాతీయ భద్రత విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశ ప్రజలలో ఆయన నాయకత్వం పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని మరింత పెంచాయని చెప్పవచ్చు.

కోవిడ్ మహమ్మారి నుంచి భారత్‌ను కాపాడుకోవడమే కాకుండా, దేశీయంగా వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసి అనేక దేశాలకు టీకాలు పంపడం మోడీ ప్రభుత్వ విజయాల జాబితాలో ఒకటి.

లాక్ డౌన్ వలన ఆయనకు విమర్శలు ఎదుర్కోవలసి వచ్చినా ప్రపంచంలోనే అతి పెద్ద టీకా కార్యక్రమాన్ని అత్యంత సమర్ధవంతంగా, విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధాని మోడీని ప్రపంచ దేశాలు సైతం ప్రశంశించాయి.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇన్ని దశాబ్దాలలో దేశాన్ని పాలించిన వారెవరూ కనీసం బులెట్ రైలు ఆలోచన కూడా చేయలేదు. కానీ ప్రధాని మోడీ దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టుని చేపట్టడమే కాకుండా మరొక రెండేళ్ళలో ప్రజలకు అందుబాటులోకి తెబోతున్నారు.

వందే భారత్‌ రైళ్ళు, తాజాగా హైడ్రోజన్ రైలు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మెట్రో రైల్ ప్రాజెక్టులు, విస్తరణ, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, ఎక్స్‌ప్రెస్‌వేలుఎవరూ, కొత్త విమానాశ్రయాలు వంటి పలు భారీ ప్రాజెక్టులు చేపట్టి ఏర్పాటు చేస్తున్నారు.

అదేవిధంగా ఇదివరకు పాలకులకు ఈశాన్య రాష్ట్రాలపై చిన్నచూపు ఉండేది. వారిని కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూసేవారు. కనుక ఆ రాష్ట్రాలు అభివృద్దికి నోచుకోలేదు.

కానీ ప్రధాని మోడీ ఈశాన్య రాష్ట్రాలుకు అనేక రహదారులు, రైల్వే మార్గాలు, రైల్వే వంతెనలు, సొరంగ మార్గాలు, వగైరా ఏర్పాటు చేశారు. తద్వారా ఆయా రాష్ట్రాల ప్రజల మనసులు గెలుచుకున్నారు.

పొరుగు దేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న ఈ రాష్ట్రాలలో మౌలిక వసతుల అభివృద్ధితో అక్కడి ప్రజలకు సౌకర్యం కల్పించడంతో పాటు దేశ భద్రత, సరిహద్దుల రక్షణ, రక్షణపరంగా చాలా వ్యూహాత్మకమైనవి కూడా.

ఒకప్పుడు భారత్‌లో అనేక పరిశ్రమలు… వాటిలో కోట్లాదిమందికి ఉద్యోగాలు, ఉపాధి లభించేవి. కానీ ఆ తర్వాత వివిధ సమస్యలు, కారణాల వలన భారత్‌ పారిశ్రామికంగా చాలా వెనుకబడింది.

ప్రధాని మోడీ ‘మేక్ ఇన్ ఇండియా’ విధానం ద్వారా ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేశారు. మొబైల్ ఫోన్ తయారీ మొదలు బ్రహ్మోస్ క్షిపణుల తయారీ వరకు పారిశ్రామికంగా గణనీయమైన పురోగతి కనిపిస్తోందిప్పుడు.

రాజకీయంగా చూసినా మోడీ ప్రభంజనం కొనసాగుతోంది. ఆయన నాయకత్వంలో బీజేపీ క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించింది. అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం లేదా ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదగడం ఆయన రాజకీయ విజయంగా చెప్పొచ్చు.

ఒక వర్గానికి ఆయన దేశాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టిన దూరదృష్టి నాయకుడు. మరో వర్గానికి ప్రజాస్వామ్య విలువలకు సవాల్ విసిరిన పాలకుడు.

అందుకే భారత రాజకీయాల్లో అత్యంత అభిమానాన్ని, అత్యంత వ్యతిరేకతను ఒకేసారి సంపాదించిన నాయకుడు ప్రధాని మోడీ అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది. కాదనగలరా?

ADVERTISEMENT
Latest Stories