సిఎం జగన్మోహన్ రెడ్డి బుదవారం పార్వతీపురం జిల్లా కురుపాంలో అమ్మఒడి బటన్ నొక్కుడు సభలో జనసేన అధినేత లారీ వేసుకొని తిరుగుతున్నారని, మూడు పెళ్ళిళ్ళు చేసుకొన్నారంటూ విమర్శలు చేశారు. వాటిపై ఊహించిన్నట్లే జనసేన నేతలు, అభిమానులు ధీటుగా స్పందిస్తున్నారు.
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ, “సమయం, సందర్భం లేకుండా నోటికి వచ్చిన్నట్లు ప్రతిపక్ష నేతలను కించపరుస్తూ మాట్లాడే ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండటం చాలా దురదృష్టకరం. ప్రభుత్వ సొమ్ముతో అధికారికంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సిఎం జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెపితే బాగుండేది. కానీ పవన్ కళ్యాణ్ లారీ వేసుకొని తిరుగుతున్నారంటూ ఏదేదో మాట్లాడారు. అయినా పవన్ కళ్యాణ్ లారీలో తిరిగితే మీకెందుకు… బస్సులో తిరిగితే మీకెందుకు?
ఓ అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో పాల్గొంటున్న మీకు విద్యార్థులు, వారి తల్లితండ్రుల ఎదుట ఏమి మాట్లాడాలో, ఏవిదంగా మాట్లాడాలో తెలియకపోతే ఎలా?సమయం సందర్భం లేకుండా ఎప్పుడు ఎక్కడ బటన్ నొక్కుడు సభ నిర్వహించినా మా అధినేత పవన్ కళ్యాణ్పై పడి ఎందుకు ఏడుస్తుంటారు మీరు?అయినా పవన్ కళ్యాణ్ అంటే మీకెందుకు అంత భయం… ఆందోళన?” అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఆయన ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ, “మా పార్టీ అధినేత, సిఎం జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకొన్నారంటూ నిన్న సభలో చాలా అసందర్భ ప్రసంగం చేసి తన మనసులో అసూయ, ద్వేషాన్ని బయటపెట్టుకొన్నారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకొంటే ఆయన కెందుకు?
ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్పై ఫిర్యాదు చేశారా?లేదు కదా?మరి ఆయన వ్యక్తిగత విషయాలను సిఎం జగన్ ఎందుకు ప్రస్తావిస్తున్నారు?అది తప్పు కాదనుకొంటే, మీ గురించి కూడా ఎదుటవాళ్ళు మాట్లాడొచ్చు కదా?మీరు మీ తల్లి విజయమ్మను, చెల్లి వైఎస్ షర్మిలను ఎందుకు బయటకు పంపించేశారు?చెప్పగలరా?”అంటూ ప్రశ్నించారు.
దీని వలన అర్దమవుతున్న నీతి ఏమిటంటే “అద్దాల మేడలో కూర్చొని ఎదుటవాళ్ళ మీదకు రాళ్ళు విసరకూడదు.”



